
బడుగులు బలి
వివిధ కార్పొరేషన్ల ద్వారా కదిరి మున్సిపల్ పరిధిలోని పేదల ఆర్థికాభివృద్ధి కోసం మంజూరు చేసిన రూ.5.57 కోట్ల నిధులు కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ల ఆధిపత్య పోరు కారణంగా ఏ ఒక్కరికీ అందకుండా మొత్తం వాపసు వెళ్లిపోయాయి.
కదిరి : వివిధ కార్పొరేషన్ల ద్వారా కదిరి మున్సిపల్ పరిధిలోని పేదల ఆర్థికాభివృద్ధి కోసం మంజూరు చేసిన రూ.5.57 కోట్ల నిధులు కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ల ఆధిపత్య పోరు కారణంగా ఏ ఒక్కరికీ అందకుండా మొత్తం వాపసు వెళ్లిపోయాయి. ఇదివరకు కదిరి మున్సిపాలిటీకి మంజూరైన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు రూ.3.20 కోట్లు కూడా వారిద్దరి కారణంగానే వెనక్కు వెళ్లిపోయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. ఫలితంగా ఈమారు బడుగు బలహీనవర్గాల వారు బలయ్యారు.
కదిరి మున్సిపాలిటీకి బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ్ కార్పొరేషన్ల ద్వారా 2016 - 17కు గాను 298 యూనిట్లు మంజూరు చేశారు. ఇందుకోసం సుమారు రూ.5 కోట్లు నిధులు కేటాయించారు. ఇవి కాకుండా నాయీ బ్రాహ్మణులు, చాకలి వృత్తిదారులు, వడ్డెర్ల కోసం ఆయా ఫెడరేషన్ల ద్వారా మరో 73 యూనిట్లు మంజూరు చేస్తూ ఇందుకోసం మరో రూ.60 లక్షలు దాకా విడుదల చేశారు. ఈ నిధులపై ఎంతో ఆశతో ఆయా వర్గాల పేదలు దరఖాస్తులు సమర్పించుకుని ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ రుణాలు మంజూరు చేయాలంటే టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదముద్ర వేయాలనే నిబంధనలు పెట్టారు. ఇక్కడే తిరకాసు వచ్చి పడింది.
మొదట మాజీ ఎమ్మెల్యే కందికుంట వర్గానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు వారి వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు రుణాలివ్వడానికి ఆయన సూచన మేరకు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చాంద్బాషా ఇటీవలు బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ కోనశశిధర్పై ఒత్తిడి తీసుకొచ్చి తన వర్గానికి చెందిన వారిని జన్మభూమి కమిటీ సభ్యులుగా వేయించుకున్నారు. దీంతో కందికుంట వర్గం జన్మభూమి కమిటీలు చెప్పకనే రద్దయిపోయాయి. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట వర్గం కోర్టును ఆశ్రయించారు. గతంలో ఉన్న జన్మభూమి కమిటీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో పేదలు నలిగిపోయారు. సకాలంలో పంపిణీ చేయనందున ఆ నిధులన్నీ వెనక్కు వెళ్లిపోయాయి.
నిధుల వాపసు వాస్తవమే
కదిరి మున్సిపాలిటీకి 2016 - 17కు గాను వివిధ కార్పొరేషన్ల ద్వారా 413 యూనిట్లకు గాను రూ.557.92 లక్షలు మంజూరయ్యాయి. సకాలంలో వాటిని దరఖాస్తుదారులకు పంపిణీ చేయనందున ఆ నిధులన్నీ వాపసు వెళ్లిన మాట వాస్తవమే.
- భవానిప్రసాద్, మున్సిపల్ కమిషనర్
కదిరి మున్సిపాలిటీకి మంజూరైన నిధుల వివరాలు
కార్పొరేషన్ పేరు మంజూరైన యూనిట్లు మంజూరైన నిధులు(లక్షల్లో)
.............................................................................
బీసీ కార్పొరేషన్ 52 యూనిట్లు రూ 56.00
కాపు కార్పొరేషన్ 73 యూనిట్లు రూ 84.80
ఎస్సీ కార్పొరేషన్ 63 యూనిట్లు రూ 125.32
ఎస్టీ కార్పొరేషన్ 03 యూనిట్లు రూ 8.60
మైనార్టీ కార్పొరేషన్ 107 యూనిట్లు రూ 221.50
నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ 42 యూనిట్లు రూ 25.20
వడ్డెర ఫెడరేషన్ 59 యూనిట్లు రూ 29.50
రజక ఫెడరేషన్ 14 యూనిట్లు రూ 7.00
మొత్తం 413 యూనిట్లు రూ 557.92