ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రజాధనం వృథా

ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రజాధనం వృథా - Sakshi

 

బోధన్‌ : ప్రాజెక్టు రీడిజైన్‌లతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తోందని మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల గోడు పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. బోధన్‌లోని తాలూకా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఆ ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా అఖిల పక్ష సమావేశం నిర్వహించి, ఇంజినీర్లు, జల నిపుణుల సలహాలు, సూచలను తీసుకుని ఒప్పందాలపై సమీక్షించడం శ్రేయస్కరమని తెలిపారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలని విమర్శిస్తున్నారన్నారు. దద్దమ్మలం మేం కాదని, మేరేనని విమర్శించారు. బోధన్‌ నియోజకవర్గంలోనే గోదావరి నది ప్రవహిస్తున్నా నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అలీసాగర్‌ ఎత్తిపోతల కింద సాగుచేసిన పంటలతో పాటు నిజామాబాద్‌ నగరం, బోధన్‌ పట్టణ ప్రజల తాగునీటి కోసం అలీసాగర్‌ రిజర్వాయర్, బోధన్‌ బెల్లాల్‌ చెరువులను గోదావరి నదిలో నీళ్లున్న సమయంలోనే నింపాలన్నారు.

బోధన్‌ మండలాన్ని రెండుగా విభజించాలి

పాలన, ప్రజల సౌలభ్యం కోసం బోధన్‌ మండలాన్ని రెండుగా విభజించాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు. బోధన్‌ అర్బన్‌లో 80 వేలు, రూరల్‌లో 70 వేలకు పైగా జనాభా ఉందన్నారు. అర్బన్, రూరల్‌ మండలాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీపీ గంగాశంకర్, మున్సిపల్‌కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ అబిద్‌ అలీ, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు గుణప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఫాషా మోహినోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top