తల్లీకూతుళ్లపై కన్నేసిన దుర్మార్గుడు | Paramour relation ship murder cases | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై కన్నేసిన దుర్మార్గుడు

Apr 20 2016 4:02 AM | Updated on Jun 14 2018 4:21 PM

తల్లీకూతుళ్లపై  కన్నేసిన దుర్మార్గుడు - Sakshi

తల్లీకూతుళ్లపై కన్నేసిన దుర్మార్గుడు

ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కన్నేసిన కామాంధుడు అది కాస్తా బెడిసి ....

  రుణం ఇప్పిస్తానంటూ తల్లితో వివాహేతర సంబంధం
ఆపై కుమార్తెపై కన్నేసిన దుర్మార్గుడు
వద్దన్నందుకు తల్లినే కాటికి పంపిన హంతకుడు
తరువాత కుమార్తెను లాడ్జిలో బంధించి చిత్రహింసలు
ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కి...

 
 
 హిందూపురం అర్బన్ :
ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కన్నేసిన కామాంధుడు అది కాస్తా బెడిసి కొట్టడంతో ఉన్మాదిగా మారాడు. తల్లిని మట్టుబెట్టి.. కూతురినీ హింసించాడు. అంతటితో ఆగక ఆమెనూ అంతమొందించేందుకు ప్రయత్నించి చివరకు హిందూపురం పోలీసులకు చిక్కాడు. అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన మాబున్నీ(47) భర్త చనిపోయాడు. ఆమె పెద్దకుమార్తె అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె బత్తలపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఒంటరిగా నివసిస్తున్న మాబున్నీకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తానంటూ రామకృష్ణ అలియాస్ బాబు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న పెద్ద కుమార్తెపై కన్నేసిన అతను, మాబున్నీపై ఒత్తిడి పెంచాడు.

అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయమై ఆమెతో ఈ నెల 15న రాత్రి గొడవపడి, కర్రతో తలపై బలంగా కొట్టి, రక్తపు మడుగులో పడి ఉన్న మాబున్నీను పట్టించుకోకుండా ఇంటికి తాళం వేసుకుని అనంతపురానికి చేరుకున్నాడు. హాస్టల్‌ల్ ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు చేరుకుని మీ అమ్మకు సీరియస్‌గా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించినట్లు నమ్మబలికి అదే రాత్రి ఆమెను హిందూపురానికి పిలుచుకెళ్లాడు. ఉదయాన్నే బెంగళూరుకు వెళ్తామని చెప్పి సాయితేజ లాడ్జిలో గది తీసుకున్నాడు. రిజిస్టర్ బుక్‌లో ‘బాబు, రొద్దం’ అని తప్పుడు చిరునామా రాయించాడు. ఆ రాత్రే సదరు యువతిని అతను శారీరకంగా హింసించి గాయపర్చాడు. ‘నా మాట వినకపోవడంతో మీ అమ్మను చంపేశా. ఇప్పుడు నీకూ అదే గతి పడుతుంది’ అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తిరగబడింది. నేరం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించాడు.

ఊపిరాడకఅపస్మారస్థితిలో పడిపోయిన ఆమెను చనిపోయిందని భావించి గదికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం దాకా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు తీసి చూడగా యువతి బాత్రూంలో ఆపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


 పోలీసుల అదుపులో నిందితుడు
 నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తాళం వేసి ఉన్న ఇంటిలో యువతి తల్లి మాబున్నీ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. యువతి తల్లి గురించి అన్ని వివరాలు సేకరించారు. మాబున్నీ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించారు. నిర్జీవంగా పడి ఉన్న మాబున్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ కేసులో నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement