టీడీపీ కౌన్సిలర్లపై ఫిర్యాదు | municipal commissioner file complaint on tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ కౌన్సిలర్లపై ఫిర్యాదు

Apr 16 2017 1:32 PM | Updated on Oct 16 2018 6:15 PM

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా విధ్వంసంపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటశివారెడ్డి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రొద్దుటూరు టౌన్‌: ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా శనివారం కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన విధ్వంసంపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటశివారెడ్డి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌కు వచ్చిన 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ తలారి పుల్లయ్య, 31వ వార్డు కౌన్సిలర్‌ గణేష్‌బాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ జబీవుల్లా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిల్‌ హాల్‌లోకి వచ్చి వీరు టేబుళ్లను, కుర్చీలను పగులగొట్టారని వివరించారు.

తలారి పుల్లయ్య కౌన్సిల్‌ మినిట్స్‌ పుస్తకాన్ని ఎన్నికల అధికారి టేబుల్‌ పైనుంచి తీసుకుని దానిని చించే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని మున్సిపల్‌ కమిషనర్‌కు అప్పగించారని తెలిపారు. ఇందులో కొన్ని పేజీలు చినిగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. వీరి వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని తెలిపారు. ఆదివారం జరిగే చైర్మన్‌ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదును డీఎంఏ, ఆర్డీ, ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులకు పంపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement