ఎంసెట్–2 లీకేజీపై దర్యాప్తు చేయాలి
ఎంసెట్–2 పేపర్ లీకేజీ ఘటనతో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పలువురికి సంబంధాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. దీనికి కారకులైన మంత్రులను గుర్తించి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
-
కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలి
-
మానుకోటలో కబ్జాకోరుల ఆగడాలు మితిమీరాయి
-
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క
మహబూబాబాద్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీ ఘటనతో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పలువురికి సంబంధాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. దీనికి కారకులైన మంత్రులను గుర్తించి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మార్వాడి సత్రంలో మానుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాలుచౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంసెట్ పేపర్ల లీకేజీపై పకడ్బందీగా దర్యాప్తు జరగాలన్నారు. మానుకోటలో కబ్జాకోరుల ఆగడాలు మితిమీరాయన్నారు. గుడి, బడినీ కబ్జా చేసే ప్రజాప్రతినిధులు ఉండటం బాధాకరమన్నారు. అటువంటి వారిపై ప్రజలు పోరాటం చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం వేలాది ఎకరాల భూములను కొనే విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాచరిక పాలనను తలపించేలా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాలని కేసీఆర్కు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూసేకరణ చట్టంపై ఈ నెల 4న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు. నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్న ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పుల్లూరు అశోక్ కుమార్, గట్టు ప్రసాద్, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంచందర్నాయక్, భూపతి మల్లయ్య, భూక్య సునిత, చుక్కల ఉదయ్చందర్, కొండపల్లి రాంచందర్రావు, మార్నేని రఘు, పాషా, భోజ్యా నాయక్, సంపతి భీష్మా, బొమ్మ వెంకటేశ్వర్లు, రాజు, ఊమ్లానాయక్, శ్యాం, సుతారపు వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.