
సీత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
స్థానిక పెదతుమ్మిడిలో ఒక మహిళ బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని మృతిచెందింది.
బంటుమిల్లి (పెడన) : స్థానిక పెదతుమ్మిడిలో ఒక మహిళ బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని మృతిచెందింది. పోలీసుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన తలారి వాసుకోటేశ్వరరావు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామం వెళ్లాడు. అక్కడ ఆ గ్రామానికి చెందిన పరసా సీతతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. కొద్దిరోజులుగా దంపతులిద్దరి మధ్య కట్నకానుకలపై గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు డ్యూటీ పనిమీద వెళ్లగా, సీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే అత్త, భర్త కుటుంబ సభ్యులు కలిసి కట్నం కోసం కొట్టి చంపారంటూ మృతురాలి పెదనాన్న పరసా నాగేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తల్లి మృతి వార్త తెలియని అభంశుభం తెలియని చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ఇంటికి వచ్చిన బంధువులను అమాయకంగా చూడటం చూపరులను కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తహసీల్దార్ డీవీ శేఖర్, బందరు ఇన్చార్జి డీఎస్పీ ఎస్కే హుస్సేన్, వీఆర్వో రామకృష్ణ పంచనామాలో పాల్గొన్నారు.