‘ముచ్చుమర్రి’పై చిత్తశుద్ధి ఏదీ | government has no intrest in muchumarri | Sakshi
Sakshi News home page

‘ముచ్చుమర్రి’పై చిత్తశుద్ధి ఏదీ

Aug 19 2016 12:23 AM | Updated on May 29 2018 4:26 PM

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నికర జలాలను వినియోగించుకోవడానికి జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు.

నెహ్రూనగర్‌(పగిడ్యాల): శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నికర జలాలను వినియోగించుకోవడానికి జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరిధిలోని నెహ్రూనగర్‌ పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానాలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణానది బ్యాక్‌వాటర్‌కు అతి సమీపంలో ఉండే నెహ్రూనగర్‌లో పుష్కర ఘాట్‌ను మంజూరు చేయకుండా కలెక్టర్‌ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. దీంతో నాయకులే సొంత ఖర్చులతో ఘాట్‌ను నిర్మించుకుని భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం వలన వేలాది మంది భక్తులకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. సీఎం చంద్రబాబు పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాయలసీమ ప్రాంతంలోని వందలాది గ్రామాల రైతులు తమ స్థిరచరాస్తులను త్యాగాలు చేసిన సంగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరువడం విచారకరమన్నారు. కేవలం కోస్తా ప్రాంత ప్రజల అభివద్ధి కోసమే పాటుపడుతూ రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహాం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం కోస్తా ప్రాంతానికే శ్రీశైలం జలాలను తరలించడంలోని ఆంతర్యమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement