ప్రజా సంక్షేమం కోసం శాసనసభ్యులు శాసనసభలో లేవనెత్తిన పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని విధానగౌతమీ సమావేశహాలులో జిల్లాకు
హామీలు సత్వరం అమలు చేయాలి
Jul 22 2016 12:00 AM | Updated on Mar 19 2019 7:00 PM
శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పెందుర్తి
కాకినాడ సిటీ :
ప్రజా సంక్షేమం కోసం శాసనసభ్యులు శాసనసభలో లేవనెత్తిన పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని విధానగౌతమీ సమావేశహాలులో జిల్లాకు చెందిన కమిటీ సభ్యులు కె.రఘుపతి, పి.గోవిందు, వేగుళ్ల జోగేశ్వరరావులతో కలసి ఆయన సమీక్షించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 14 హామీల్లో ఎనిమిదింటిని పెండింగ్లో పెడుతూ, ఆరు హామీల విషయంలో తీసుకున్న చర్యపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. కోస్తా జిల్లాలో ఓడరేవులు, కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి సరకుల రవాణాపై 2009, 2001లో ఇచ్చిన హామీలపై చేపట్టిన చర్యలను కమిటీ సమీక్షించింది. ఈ సమావేశానికి సంబంధిత పోర్టు సీనియర్ అధికారులు హాజరు కాకపోవడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. యాంకరేజీ పోర్టులో సుమారు 8 నుంచి 10వేల మంది వర్కర్లు పనిచేస్తున్నా, అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు లేకపోవడంపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోర్టును స్వయంగా త్వరలో పరిశీలించాలని నిర్ణయించింది. అదేవిధంగా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతపై కూడా సత్వర చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, వైద్య పరికరాలు ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ప్రైవేటు వైద్యుల సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులు సూచించారు. సామర్లకోట పురపాలక సంఘంలో నిధుల దుర్వినియోగం విషయంపై చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. విచారణాధికారిగా నియమితులైన రీజనల్ డైరెక్టర్ సమావేశానికి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలకు ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి, అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి భీమశంకరం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మురళీధర్, గోదావరి డెయిరీ డీడీ ఉమాదేవి, రంపచోడవరం ఇన్చార్జి సబ్–కలెక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement