భూముల సర్వేను అడ్డుకున్న రైతులు
చింతలపూడి : నష్టపరిహారం విషయం తేల్చాకే చింతలపూడి ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించాలని ప్రగడవరం, వెలగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. చింతలపూడి మండలం ప్రగడవరంలో రెవెన్యూ సిబ్బంది మంగళవారం చేపట్టిన ఎత్తిపోతల పథకం కాలువ పనులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇచ్చే నష్టపరిహారం విషయం తేల్చలేదని, పట్టిసీమ తర హా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, కె.శంకర్రెడ్డి, గంగవల్లి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నష్ట పరిహారం తేలకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని చెప్పారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా చేశారు. సర్వే సిబ్బందిని అడ్డుకోవడంతో చింతలపూడి తహసీల్దార్ టి.మైఖేల్రాజ్, ఎసై ్స సైదానాయక్ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులను సమావేశపరిచి చర్చలు జరిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, సర్వే పనులను జరగనివ్వాలని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్టపరిహారం అందిస్తారో వెల్లడించాలని ఆ తరువాతే సర్వే జరగనిస్తామని రైతులు తహసీల్దార్కు తెలియచేశారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను వదులుకోవాల్సి వస్తుందని వాపోయారు.lజిల్లాలో ఒకచోట ఒకలా రైతులకు నష్టపరిహారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణకు వారం రోజుల ముందు నోటీసులు ఇచ్చి సర్వే పనులు చేపట్టాలని తెలియచేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనక్కువెళ్లారు.