బిడ్డలకు బరువై...బతుకు భారమై... | elderly couple commit to suicide | Sakshi
Sakshi News home page

బిడ్డలకు బరువై...బతుకు భారమై...

Jul 11 2017 2:11 AM | Updated on Nov 6 2018 8:08 PM

మృతి చెందిన వృద్ధ దంపతులు - Sakshi

మృతి చెందిన వృద్ధ దంపతులు

మీకు తిండిపెట్టడమే దండగ.. రోగాలు సరేసరి.. మీరు ఇంట్లో ఉంటే మాకు అంటుకుంటాయి.. ఎక్కడికైనా వెళ్లిపోండి అంటూ కుమారుడి ఈసడింపులు..

మనస్థాపంతో ఉరివేసుకుని వృద్ధ దంపతుల బలవన్మరణం
కన్నబిడ్డల ఆదరణ కరువు    
క్షీణించిన ఆరోగ్యం
ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హింసించిన కుమారుడు


మీకు తిండిపెట్టడమే దండగ.. రోగాలు సరేసరి.. మీరు ఇంట్లో ఉంటే మాకు అంటుకుంటాయి.. ఎక్కడికైనా వెళ్లిపోండి అంటూ కుమారుడి ఈసడింపులు.. రోగాలతో ఇంట్లోనే పడుంటారా... ఇలా ఎంతకాలం.. ఎక్కడికైనా పోండి.. అంటూ బంధువుల సతాయింపులు.. దాచుకున్న డబ్బులో కొంతైనా ఇచ్చేందుకు  కనికరించని పుత్రరత్నం.. ఏమీ చేయలేని నిస్సహాయత.. ఎక్కడికి వెళ్లాలో.. ఎలా బతకాలో తెలియని అయోమయం.. చావే శరణ్యమంటూ నిర్ణయం.. పెళ్లినాడు చేసుకున్న బాసలు గుర్తొచ్చాయో ఏమో.. ఆ దంపతులు ఒకరికొకరు తోడుగా    బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఈ లోకాన్ని వీడారు.. ఈ విషాదకర ఘటన విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి జరిగింది.

కృష్ణలంక (విజయవాడ తూర్పు): నవ మాసాలు మోసి పిల్లల ఆలనాపాలనా చూశారు. ప్రయోజకుల్ని చేశారు. వృద్ధాప్యం మీదపడింది. ఆరోగ్యం క్షీణించింది. పిల్లల ఆదరణా కరువైంది. అప్పటివరకూ చూస్తున్న చిన్నకొడుకు కనికరంలేకుండా పోయాడు. అమ్మానాన్నలను ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఎంతోకొంత ఇస్తే వెళ్లిపోతామని వేడుకున్నారు. అయినా కొడుకు మనసు కరగలేదు. ఛీదరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ వృద్ధ దంపతులు మనస్సు చంపుకుని తనువు చాలించారు. అందరినీ కదిలించే ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పాత పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది.

పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంక పాత పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో నివసించే బొచ్చు సత్యనారాయణ (65), కనకదుర్గ (61) దంపతులు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు చెన్నకేశవులు ఒంగోలులో మెడికల్‌ హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తుండగా.. రెండో కుమారుడు దుర్గాప్రసాద్‌ విజయవాడలోనే పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. దంపతులిద్దరూ ఏడాదిగా రెండో కొడుకు వద్దే ఉంటున్నారు. ఇటీవల దంపతులకు ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి ‘మీకు తిండిపెట్టడమే దండగ. దానికి తోడు రోగాలు... మాతో ఉంటే మీ రోగాలు మాకూ అంటుకుంటాయి’ అంటూ రెండో కుమారుడు వేధి స్తూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని చిరాకుపడుతున్నాడు.

తాను ఇచ్చిన రూ.3 లక్షల్లో కొంత ఇస్తే ఎక్కడైనా బతుకుతామని సత్యనారాయణ అడగ్గా కొడుకు మనస్సు చలించలేదు. తన వద్ద డబ్బుల్లేవని, ఇంట్లో ఉండొద్దంటూ వేధింపులకు దిగుతున్నాడు. నాలుగురోజుల క్రితం దుర్గాప్రసాద్‌ తన మామ, తోడల్లుడిని భీమవరం నుంచి పిలిపించి, వారితోనూ తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హింసించాడు. చిన్న కొడుక్కి మూడు లక్షలు ఇచ్చినందున అతని వద్దే ఉండాలని పెద్దకొడుకూ అంటున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వృద్ధ దంపతులు సోమవారం చిన్న కొడుకు ఇంట్లోనే ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కొడుకు చిత్రహింసలు భరించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. చిన్నకొడుకు, అతని బంధువులందరూ పరారీలో ఉన్నారు. తల్లిదండ్రుల ఆత్మహత్య వార్త తెలుసుకుని కుమార్తె ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement