నెలాఖరులో ‘కోట’ ఫెస్టివల్‌..!


భువనగిరి : రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నం.. చారిత్రక కట్టడాలకు సజీవ సాక్షంగా ఉన్న భువనగిరి కోట ఉత్సవాలను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భువనగిరి ఖిలాపై నిర్మించిన కోట చరిత్రను విశ్వవ్యాప్తంగా చాటి చేప్పేలా రూ 50లక్షల ఖర్చుతో ఫెస్టివెల్‌ నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన యాదాద్రిభువనగిరి జి ల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అందరికీ తెలియజేసేలా ఫెస్టివెల్‌ పేరుతో ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భువనగిరి కోట, కొలనుపాక, రాచకొండ, భూదాన్‌పోచంపల్లిలు ఉన్నాయి. మొదటగా ఈ సంవత్సరం భువనగిరి కోట ఫెస్టివెల్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.



రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు

భువనగిరి కోట ఉత్సవాల కోసం అధికారులు రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికను రూపొందించారు. ఇందులో భా గంగా భువనగిరి కోటపై మూడురోజుల పాటు లైటింగ్, ఒకరోజు లేజర్‌ షో, ప్రతిరోజు సాయంత్రం సమయంలో తెలంగాణ కళారూపాలతో సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. భువనగిరి కోట ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలిపే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. రాక్‌ క్‌లైంబింగ్‌ పై  అవగాహన, జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారికి సన్మానం, భూదాన్‌పోచంపల్లి వస్త్రాలతో పోచంపల్లి ఇక్కత్‌మేళా, తెలంగాణ పుడ్‌ ఫెస్టివెల్‌ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోని శుక్ర, శని, అదివారం వచ్చేలా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఫెస్టివెల్‌కు వివిధ జిల్లా లు, ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా వి దేశీయులు కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటి సారి ఉత్సవాలు నిర్వహిస్తుండడం వల్ల అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top