దారుణం
♦ రోడ్డు పక్కన పడిన మృతశిశువు
♦ శరీర భాగాలు పీక్కుతిన్న కుక్కలు
♦ ఉరి వేసినట్లుగా మెడలో తాడు
అనంతపురం సెంట్రల్:
దారుణం జరిగిపోయింది. మాటల కందని విషాదం వెలుగుచూసింది. మూడు రోజుల వయసుగల మృతశిశువు .. ఎవరో కత్తిరించినట్లుగా రెండు చేతులూ భుజాల వరకూ లేవు! ఉరివేసినట్లుగా మెడలో తాడు!! ఏ తల్లి కన్న బిడ్డో తెలీదు కానీ చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. అనంతపురంలోని జేఎన్టీయూ సమీపంలో మంగళవారం ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటరమణ అక్కడకు చేరుకుని పరిశీలించారు.
ప్రాథమిక దర్యాప్తులో రెండు రోజుల క్రితం జేఎన్టీయూ సమీపంలో పడి ఉన్న ఆడ మృతశిశువును స్థానికులు గుర్తించి సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. లోపం ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. పాతిపెట్టిన మృతశిశువును కుక్కలు వెలికి తీశాయి. రెండు చేతులూ పీక్కు తిన్నాయి. అంతటితో ఆగకుండా రోడ్డుపైకి లాక్కొచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు కుక్కలను తరిమేసి, మృతశిశువును తిరిగి ఖననం చేసేందుకు యత్నించారు.
అయితే మృత శిశువును చేతుల్లోకి తీసుకోకుండా మెడకు తాడుకట్టి లాక్కెళ్లేందుకు యత్నించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాçస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా శిశువు రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు తేలిందని, పాతిపెట్టిన మృతశిశువును కుక్కలు వెలికి తీశాయని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు.