అంతర్రాష్ట్ర కారు దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం: కార్ల దొంగతనానికి పాల్పడుతోన్న ఇద్దరు దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల పేర్లు వాసా చంద్రశేఖర్, దంతులూరి కృష్ణంరాజుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 3 లక్షల 40 వేల నగదు, మూడు మారుతీ బ్రెజా కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దొంగతనం చేసిన కార్లు కొని వాటికి నకిలీ ఆర్సీలు సృష్టించి బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కొండపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తాను కొన్న బ్రెజా కారును సర్వీస్ నిమిత్తం మారుతీ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఆన్లైన్లో చెకింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.