చోరీకొచ్చి.. నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడి

Thief Molested On Sleeping Woman At Chennai - Sakshi

సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు అతడ్ని గుర్తించారు. అజ్ఞాతంలో ఉన్న ఆ దొంగ కోసం గాలిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. అయినా, అక్కడక్కడ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే వారి పర్సులు కొట్టేయడం, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడడం చేస్తున్నారు. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అలాగే, మోటార్‌ సైకిళ్ల చోరీలు సైతం పెరిగాయి.

నిర్మానుష్య ప్రాంతాల్లో ఇళ్లలో నుంచి జనం బయటకు రావడం లేదు, ఇళ్ల ముందు ఉంచిన వాహనాలు ఎత్తుకెళ్తున్నారు. అలాగే, అనేక కార్యాలయాలు సంస్థల వద్ద పార్క్‌ చేసిన వాహనాలు మాయం అవుతున్నాయి. ఈ కేసుల విచారణలు పోలీసులకు శిరోభారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మహిళపై లైంగిక దాడికి పాల్పడడం అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లో కలకలం రేపింది. 
ఒంటరిగా ఉన్న మహిళ... 
అన్నాగనర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి వెనుక వైపు నుంచి ఓ యువకుడు గురువారం సాయంత్రం ప్రవేశిస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. కేకలు పెట్టడంతో అతడు ఉడాయించాడు. తాను వేసిన పథకం బెడిసి కొట్టడంతో ఆగ్రహంతో తిరుమంగళం వైపు ఓ నాలుగు అంతస్తుల భవనంలోకి ఆ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పై అంతస్తు డాబాపై ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై తనప్రతాపం చూపించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఉడాయించాడు. ఆమె పెట్టిన కేకలతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అన్నాగనర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు ఆ యువకుడు అమింజికరైకు చెందిన వేల్‌మురుగన్‌ కుమారుడు రామకృష్ణన్‌గా తేలింది. చోరీ కేసులో అరెస్టయిన, ఇతగాడు లాక్‌డౌన్‌ పుణ్యమా బయటకు వచ్చాడు. జైలు నుంచి రాగానే, దొంగతనానికి ప్రయత్నించి, చివరకు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చదవండి: వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top