నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ వీరంగం

మీర్‌పేటలో వాచ్‌మన్‌ను కట్టేసి చోరీ

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ మళ్ళీ హల్‌చల్‌ చేస్తోంది. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం అగ్రకల్చర్‌ కాలనీలో బుధవారం వేకువజామున ఎనిమిది మంది చెడ్డీ గ్యాంగ్‌ ముఠా వీరంగం సృష్టించారు. ఏపీ09 సీపీ 4061 నంబర్‌ గల వాహనంలో వచ్చిన ముఠా బ్లూమింగ్‌ డాల్‌ అపార్టుమెంట్‌లోకి జోరబడి వాచ్‌మన్‌ను కట్టేశారు, అనంతరం లోనికి ప్రవేశించి ఎనిమిది ఫ్లాట్లకు బయటి నుంచి గడియ పెట్టారు. 

చంద్రమోహన్‌రెడ్డికి చెందిన అపార్టుమెంట్‌లోకి ప్రవేశించి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఇంట్లో లేరు. పనిమీద పొరుగూరికి వెళ్ళారు, ఆయన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. అలజడి విన్న ఇరుగుపొరుగు అపార్టుమెంట్‌లలోని వారు లేచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా బయటి తలుపులు తెరుచుకోలేదు. దాంతో గట్టిగా కేకలు పెట్టారు.  కేకలు విన్న సమీపంలోని ప్రజలు రావడంతో  చెడ్డీగ్యాంగ్‌ ముఠా పరారైంది.

విషయం తెలుసుకున్న ఎల్‌బీ నగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు సిబ్బందితో చోరీ జరిగిన అపార్టుమెంట్‌ను పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. చెడ్డీగ్యాంగ్‌ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top