అమ్మవారి ఎదుట ఆత్మహత్యాయత్నం | Suicide before Ammavaru at Basara Temple | Sakshi
Sakshi News home page

అమ్మవారి ఎదుట ఆత్మహత్యాయత్నం

Mar 23 2018 2:39 AM | Updated on Nov 6 2018 8:16 PM

Suicide before Ammavaru at Basara Temple - Sakshi

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ఓ సైకో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారి ఎదుట కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. అమ్మవారి అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన ప్రసాద్‌గౌడ్‌.. ఆలయ ప్రాంగణంలోని తూర్పు ద్వారం వద్ద స్వీపర్‌ సుశీల శుభ్రపరుస్తుండగా ఆమెను పక్కకు నెట్టి లోపలికి ప్రవేశించాడు.

గుడి లోపలికి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో పూజారులు చంద్రకాంత్, బాలకృష్ణలను బెదిరించాడు. దీంతో వారు భయపడి బయటికి పరుగులు తీశారు. ఆలయ సిబ్బంది ప్రసాద్‌గౌడ్‌ను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, కత్తితో చేయి, గొంతు కోసుకున్నాడు. వెంటనే సిబ్బంది అతడిని నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రసాద్‌కు ఉద్యోగం రాకపోవడం, పెళ్లి కాకపోవడంతో సైకోగా మారాడని తెలిసింది. గతేడాది ఇలాగే ఇదే ఆలయంలో చొరబడి అమ్మవారి ఎదుట బ్లేడ్‌తో గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement