సాయి దీక్షలోనే తుదిశ్వాస | Road Accidents In Adilabad | Sakshi
Sakshi News home page

సాయి దీక్షలోనే తుదిశ్వాస

Aug 30 2018 1:10 PM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accidents In Adilabad - Sakshi

సంఘటన స్థలంలో సృహతప్పి పడి ఉన్న రవి, కృష్ణ    రవి మృతదేహం

జైనథ్‌(ఆదిలాబాద్‌): సాయి దీక్ష స్వీకరించి తన బైక్‌పై ఇంటికి వస్తున్న జైనథ్‌ మండలం సావాపూర్‌ గ్రామానికి చెందిన అరిగెల రవి (22)ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం ఉదయం అదిలాబాద్‌లోని క్రాంతినగర్‌ సాయిబాబా ఆలయంలో సాయి దీక్ష తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన బాలుడు వైభవ్‌ కృష్ణతో కలిసి వచ్చాడు. పూజాది కార్యక్రమాలు ముగించుకొని మాలధారణ తర్వాత ఇద్దరు కలిసి సావాపూర్‌కు తిరిగి పయనమయ్యారు. భోరజ్‌–బేల అంతర్రాష్ట్రీయ రహదారిపై తరోడ బ్రిడ్జి మరమ్మతుల కోసం రోడ్‌ను మూసివేయడంతో ఆదిలాబాద్‌ మండలం లాండ సాంగి రూట్‌లో బయలు దేరారు. కాగా జైనథ్‌ మండలం అడ గ్రామ సమీపంలో ఎదురుగా గుర్తుతెలియని వాహనం వచ్చి వీరిని ఢీకొంది. దీంతో రవి తలికి దెబ్బతగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.

వైభవ్‌ కృష్ణ కుడి కాలు విరిగింది.  అటుగా వెళ్తున్న వారు వెంటనే 108లో రిమ్స్‌కు తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి తండ్రి ఆశన్న 8 సంవత్సరాల క్రితమే చనిపోవడంతో తల్లి విమల కుటుంబాన్ని పోశిస్తూ రవిని చదివిస్తోంది. రవికి ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. కాగా రవి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. కుటుంబానికి ఆసరా ఉండేందుకు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం రవి శవాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. గ్రామస్తులు, యువకులు చివరి చూపుకోసం భారీగా తరలివచ్చారు. కాగా> ఎదిగిన కొడుకును కళ్లముందే రక్తపు మడుగులో చూసిన తల్లి విమల హతాశురాలైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement