వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం  | Priest committed suicide in East godavari | Sakshi
Sakshi News home page

వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం 

Oct 4 2018 3:12 AM | Updated on Oct 4 2018 3:12 AM

Priest committed suicide in East godavari - Sakshi

అర్చకుడి మృతదేహంతో ఆందోళన చేస్తున్న అర్చక సమాఖ్య నేతలు మల్లికార్జునశర్మ (ఫైల్‌)

రాజమహేంద్రవరం క్రైం: గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలంటూ ధర్మకర్తల మండలి ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, కణుపురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కొత్తలంక మల్లికార్జున శర్మ (30)అర్చకుడు. అతని తండ్రి సత్యనారాయణ శర్మ 40 ఏళ్లుగా ఇక్కడే అర్చకుడిగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటుండడంతో మల్లికార్జున శర్మ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

అయితే దేవాలయంలో గుప్త నిధులున్నాయనే వదంతులు రావడంతో దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునశర్మపై తవ్వకాలకోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో మరో పూజారిని నియమించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున శర్మ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. తనపై జరిగిన వేధింపుల విషయాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వేందుకు సహకరించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, కాగా తాను వేదమంత్రాలు వల్లెవేస్తూ మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.దీనిపై అర్చక సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. మల్లికార్జున శర్మ మృతదేహంతో  తమ నిరసనను తెలిపింది. అర్చకులకు రక్షణ కల్పించాలని  కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement