పోలీసుల అదుపులో నాగపూర్ మహిళా ముఠా
ప్రయాణికుల దృష్టి మళ్లించి చోరీలు
అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు
కాజీపేట రూరల్ : కాజీపేట జీఆర్పీ పోలీసులు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని కాజీపేట మండల తహసీల్దార్ కార్యాయలంలో తహసీల్దార్ రవీందర్ ముందు బైండోవర్ చేశారు. కాజీపేట జీఆర్పీ సీఐ ఎస్.వెంకటేష్, ఎస్ఐ జితేందర్ రెడ్డి విలేకర్లకు తెలిపిన వివరాల ప్రకారం..కాజీపేట రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీ చేస్తుండగా కొందరు మహిళలు ప్రయాణికుల బ్యాగులను అనుమానాస్పదంగా చూస్తూ వాటిని తనిఖీ చేయబోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నాగపూర్లోని పార్వతినగర్కు చెందిన వారుగా గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ మహిళలు రైళ్లలో ప్రయాణికుల వద్ద చంటిపిల్లలను ఎత్తుకొని బిక్షాటన చేస్తూ జాలిపడేటట్లు నటిస్తూ అనుకూల సమయం దొరికినప్పుడు మహిళా ప్రయాణికుల హ్యాండ్ బ్యాగుల నజర్వేసి నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తుంటారని చెప్పారుజ 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. రైళ్లలో బిక్షాటన చేస్తున్నట్లు నటించే మహిళలను, చిరు వ్యాపారాలు చేసే వారిని ప్రయాణికులు నమ్మరాదని వారు తెలిపారు.