సాక్షి, పెద్దపల్లి: కన్నకొడుకును ఓ తల్లి రోకలిబండతో కొట్టి చంపిన దారుణమైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మంథనిలోని ఎరుకులగూడెం గ్రామానికి చెందిన ఈర్నాల రేణుక తన కొడుకు ఈర్నాల దినేష్ను మంగళవారం వేకువజామున రోకలిబండతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
రేణుకకు ఇద్దరు కొడుకులు. కాగా చిన్న కొడుకు దినేష్ నిత్యం మద్యం మత్తులో జోగుతూ తల్లిని కొట్టేవాడు. సోమవారం రాత్రి ఇంటికే మద్యం తెచ్చుకుని తాగి తల్లిపై దాడికి యత్నించడంతో తిరగబడ్డ తల్లి రోకలి బండతో తలపై బాదింది. తను కొట్టిన దెబ్బకు కొడుకు మృతిచెందిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
తన కొడుకు మద్యానికి బానిసై కొద్ది రోజులుగా సైకోగా మారి వేధింపులకు గురిచేసేవాడని రేణుక పోలీసులకు తెలిపింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.