స్నేహితుడి భార్య కిడ్నాప్, అత్యాచారం

Molestation On Married Woman In West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు టౌన్‌: స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి నమ్మించి పుట్టింటి నుంచి భర్త తీసుకురమ్మన్నాడంటూ ఏలూరు తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు నేరాలకు సంబంధించి  ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ వివరాలు వెల్లడించారు. ఏలూరు రామకృష్ణాపురం ప్రాంతంలో  అద్దెకు నివాసం ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో కారు డ్రైవర్‌ బూర్లి హేమసుందర్‌ అలియాస్‌ సురేష్‌ స్నేహితులు. హేమసుందర్‌కు, భార్యకు మనస్పర్థలు రావడంతో  ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బూర్లి హేమసుందర్‌ ఒక్కడే నివాసం ఉంటున్నాడు. హేమసుందర్‌ భార్యపై కన్నేసిన పల్లి నానిబాబు అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈ నెల 9న  హేమసుందర్‌  తన భార్యను ద్వారకా తిరుమలలోని ఆమె పుట్టింటి వద్ద విడిచిపెట్టి రావడం నానిబాబు గమనించాడు.

పథకం ప్రకారం.. ఈ నెల 11న స్నేహితుడు హేమసుందర్‌ భార్యకు నానిబాబు ఫోన్‌ చేసి తను కిరాయికి భీమడోలు వచ్చానని, లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు తిరగడం లేదు కదా... మీ ఆయన నిన్ను తీసుకురమ్మన్నారంటూ నమ్మించాడు. నానిబాబు, మరో డ్రైవర్‌ వాసాది కాశి అనే మరో డ్రైవర్‌ ఆమెను కారులో ఎక్కించుకుని ఏలూరు తీసుకువచ్చారు. అనంతరం స్నేహితుడి భార్యను ఒక గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త హేమసుందర్, తన స్నేహితుడు పల్లి నానిబాబు రూం వద్దకు వెళ్లగా అతనిని కూడా తీవ్రంగా గాయపరిచారు. హేమసుందర్‌ జరిగిన విషయాన్ని బంధువులకు తెలియచేయగా వారంతా నానిబాబును నిలదీయడంతో ఆమెను పంపించి వేశారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించిన సీఐ మూర్తి, ఎస్సై ఎంవీ రమణ, హెచ్‌సీ స్వామి, పీసీ హేమసుందర్, దుర్గారావులను డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top