ప్రాణం తీసిన నిర్లక్ష్యం

Lorry Rolle Obered in Canal East Godavari - Sakshi

రెయిలింగ్‌ను ఢీకొని కాలువలోకి లారీ బోల్తా

క్లీనర్‌ మృతి, డ్రైవర్‌కు గాయాలు

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం రూరల్‌ : లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.  లారీ కాలువలోకి బోల్తా కొట్టి క్లీనర్‌ మృతిచెందిన ఘటన గురువారం నందమూరు అక్విడెక్ట్‌ వద్ద చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ పి.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు నుంచి తణుకు క్వారీ డస్ట్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడెక్ట్‌ వద్దకు వచ్చే సరికి లారీ డ్రైవర్‌ కంటిపూడి దుర్గారమేష్‌ నిర్లక్ష్యం కారణంగా అక్విడెక్ట్‌ రెయిలింగ్‌ను ఢీకొని కాలువలోకి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో లారీ కేబిన్‌లో ఇరుక్కుని చాగల్లుకు చెందిన లారీ క్లీనర్‌ కేతా ఈశ్వరరావు (35) మృతి చెందగా, దొమ్మేరుకు చెందిన లారీ డ్రైవర్‌ కంటిపూడి దుర్గారమేష్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది సహకారంతో కేబిన్‌లో ఇరుక్కున్న లారీ క్లీనర్‌ కేతా ఈశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం రూరల్‌ ఏఎస్సై ఎస్‌వీఎస్‌ఎస్‌ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వైపు వెళ్తున్న లారీ, ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసి రావడంతో ఆ లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీకొని కాలువలోకి బోల్తా పడినట్టు లారీ డ్రైవర్‌ కంటిపూడి దుర్గారమేష్‌ చెబుతున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top