
పట్టుబడ్డ బర్మా శరణార్థులు
సాక్షి, పహాడీషరీఫ్: భారత పౌరసత్వానికి సంబంధించి అక్రమంగా గుర్తింపు కార్డులు కలిగి ఉన్న తొమ్మిది మంది బర్మా శరణార్థులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. ఎస్సై మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. బర్మా దేశానికి చెందిన మహ్మద్ నూర్ అలియాస్ నూర్ మహ్మద్(52) తన కుటుంబంతో 2013లో బాలాపూర్ అల్ జాబ్రీ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతడు దళారులను ఆశ్రయించి ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డులను సంపాదించాడు.
సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు దాడులు చేసి నూర్ మహ్మద్తో పాటు భార్య షాన్జిద్దా(45), పిల్లలు మహ్మద్ జావెద్(22), నౌరీ అమీన్(17), ఫౌజియా(17), ఫయాజుల్ హసన్(13), నజిముల్ హసన్ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇదే కాలనీలో అక్రమంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ హాశీం(17), అస్మా బేగం(22)లను కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఆధార్ కార్డులు, రెండు పాస్పోర్టులు, రెండు ఓటర్ గుర్తింపు కార్డులు, రెండు పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.