భార్యను హత్య చేసి..యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం

Husband Killed Wife After Commits Suicide Attempt - Sakshi

చైతన్యపురి: భార్యాభర్తల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. గొంతుపిసికి భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి  యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన  సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా సైదాపూర్‌కు చెందిన గోపాల్‌చారి పెయింటర్‌ పనిచేసేవాడు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన అతను భార్య కవితతో కలిసి పీఅండ్‌టీ కాలనీ ప్రగతినగర్‌లో ఉంటున్నాడు.

బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన కవిత ‘నన్ను వదిలేయ్, నేను నీతో ఉండను’ అని చెప్పడంతో ఆగ్రహానికిలోనైన గోపాల్‌చారి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం యాసిడ్‌ తాగి రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. తన భార్యను హత్య చేసి యాసిడ్‌ తాగినట్లు చెప్పడంతో ఇంటి ఓనర్‌ బాలరాజు అక్కడికి వెళ్లి చూడగా కవిత అపస్మారకస్థితిలో పడి ఉంది. దీంతో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా కవిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. గోపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కవిత, గోపాల్‌ ఇద్దరికీ గతంలోనే రెండు పెళ్లిల్లు అయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top