భర్త కొట్టిన దెబ్బలకు భార్య మృతి
వాజేడు: క్షణికావేశంతో భర్త కొట్టిన దెబ్బలకు భార్య మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోయవీరాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయవీరాపురం గ్రామానికి చెందిన యానక రంగారావు–యానక రాజేశ్వరి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. క్షణికావేశానికిలోనైన భర్త రంగయ్య భార్యను కొట్టాడు.
దీంతో ఆమె తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం లేవగానే నొప్పులుగా ఉండడంతో ఆమె చీకుపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ డాక్టర్ లేకపోవడంతో రక్తస్రావం అవుతున్న ఆమెను వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లమని వైద్యుడి తల్లి ఆటోలో ఎక్కించి పంపింది. ఆటో డ్రైవర్ ఆమెను తీసుకువెళ్తుండగా అందులో నుంచి కింద పడిపోయింది.
దీంతో భయపడిన డ్రైవర్ ఆమెను చీకుపల్లి ఊరు చివరన ఉన్న బ్రిడ్జిపైనే పడుకోబెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకునేలోగానే రాజేశ్వరి మృతి చెందింది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్, వెంకటాపురం (కే) సీఐ రవీందర్ వివరాలను సేకరించారు. ఎస్సై కృష్ణ ప్రసాద్ హత్య కేసు నమోదు చేయగా సీఐ రవీందర్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలి భర్త రంగారావు పరారీలో ఉన్నట్లు తెలిపారు.