బైక్‌ను ఢీకొట్టిన టాటా సఫారీ | Drunk And Drive Accident in East Godavari | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన టాటా సఫారీ

Feb 21 2019 8:11 AM | Updated on Feb 21 2019 8:11 AM

Drunk And Drive Accident in East Godavari - Sakshi

పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న మృతుడి బంధువులు (అంతరచిత్రం) ప్రమాదస్థలంలో గంగరాజు మృత దేహం

తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం): మద్యం మత్తులో టాటా సఫారీ కారుతో వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న మోటరు సైకిళ్లను బలంగా ఢీకొట్టడంతో వాటిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మారేడుమిల్లి సమీపంలోని రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం చోటుచేసుకుంది.

మండల పరిధిలోని సున్నంపాడు గ్రామానికి చెందిన కంగల గంగరాజు దొర(62) అనే గిరిజనుడు సున్నంపాడులోని తన ఇంటి వద్ద నుంచి పని నిమిత్తం మోటార్‌ సైకిల్‌పై మారేడుమిల్లి వస్తుండగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వెలగాల రామరెడ్డి అనే వ్యక్తి మద్యం సేవించి టాటా సఫారీ కారులో వెళుతూ మారేడుమిల్లి– రంపచోడవరం రహదారిలో స్థానిక టేక్‌ ప్లాటేషన్‌ దాటిన తరువాత మలుపులో ఎదురుగా వస్తున్న బైక్‌ను అతి వేగంతో  బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న గంగరాజు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడి, అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో మృతి చెందిన గంగరాజు మారేడుమిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ గతేడాది ఉద్యోగవిరమణ పొందాడు. 

పరారయ్యే ప్రయత్నంలో
కారుతో బైక్‌ను ఢీకొట్టిన తరువాత నిందితుడు రామారెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేçపథ్యంలో సంఘటన స్థలం నుంచి కిలో మీటరు దూరం వెళ్లగానే చీకట్లో మలువు వద్ద కాకినాడ  నుంచి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి బొలెరో వాహనంలో వెళుతున్న వారిని ఢీకొట్టాడు. దీంతో నిందితుడి వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బొలెరో వాహనం వెనుక టైర్‌ విరిగిపోయింది. నిందితుడు మద్యం మత్తులో ఉండడాన్ని గమనించి, అతడిని  వాహనదారులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చి అప్పగించారు.

నకిలీ సర్టీఫికెట్‌తో చలామణీ ...
నిందితుడు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌ పొంది గిరిజన గ్రామంలో చలామణీ అవుతున్నాడు. అమాయక గిరిజనులను మోసం చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతుండేవాడని, గతంలో డబ్బు వెదజల్లి పలు కేసులు నుంచి బయటకు çవచ్చాడని పలువురు అంటున్నారు.   స్టేషన్‌ వద్ద బంధువులు ధర్నాప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన నిందితుడు రామారెడ్డిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అతడు రాజభోగాలు అనుభవిస్తున్నారని మృతుడి బంధువులు, గ్రామ గిరిజనులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. ఇంతలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పది నిమిషాల్లో అతడు బయటకు వచ్చేయడంతో ఆగ్రహించిన బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆందోళనను ఉధృతం చేశారు. నిందితుడు డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించడానికి చూస్తున్నారని బంధువులు వాపోయారు. చివరికి రాజకీయ నాయకులు సమక్షంలో మృతుడి కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం చేస్తామని ఎస్సై ఎ. రాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement