అనుమానాస్పద స్థితిలో జర్నలిస్ట్‌ మృతి

Delhi Journalist Anuj Gupta Found Dead - Sakshi

హరిద్వార్‌ : ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌ అనుజ గుప్తా అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. శనివారం నుంచి కనిపించకుండా పోయిన అనుజ్‌ గుప్తా ఉత్తరాఖండ్‌లోని హరిద్వారాలో శవమై కనిపించారు. గంగ్‌నహర్‌ కాలువపై ఉన్న పాత్రి పవర్‌హౌజ్‌ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. అనుజ్‌ ఢిల్లీ ద్వారకాలోని సత్యం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆయన హరిద్వార్‌లోని ఓ హోటల్‌కి వెళ్లారు. ఆ తర్వాత బయటకు వెళ్లిన అనుజ్‌.. రాత్రి సమయంలో హోటల్‌ రూమ్‌కు తిరిగివచ్చారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలైనప్పటికీ అతను తన రూమ్‌ డోర్‌ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది.. డోర్లు కొట్టి చూసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. 

వెంటనే హోటల్‌ సిబ్బంది బుకింగ్‌లో అనుజ్‌ ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌చేశారు. కానీ ఆ ఫోన్‌ ఎత్తిన అనుజ్‌ కుమారుడు తన తండ్రి శనివారం నుంచి కనిపించడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని హోటల్‌ సిబ్బందికి తెలిపాడు. దీంతో హోటల్‌ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి సమక్షలంలో అనుజ్‌ రూమ్‌ను తెరిచారు. అందులో అతడు కనిపంచలేదు.. అయితే ఫ్లోర్‌పై మాత్రం రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు గుప్తా రాత్రి 11 గంటలకు హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. 

కాగా, అనుజ్ ఎడమ చేతి మణికట్టుపై బ్లేడుతో కోసిన గాయాలు ఉండటం, హోటల్‌ రూమ్‌లో బ్లేడ్‌ లభించడంతో అతను అత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టమ్‌ అనంతరం అనుజ్‌ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top