ఓటీపీ అడిగారు..రూ.20 వేలు కాజేశారు

Cyber Criminals Paytm Transfers In Lorry Driver Account With OTP Guntur - Sakshi

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం) : హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన గేదల లక్ష్మణ ఓ లారీ డ్రైవర్‌. లారీకి మరమ్మతులు చేయిస్తుండగా సెల్‌ఫోన్‌ మోగింది. హిందీలో మాట్లాడటంతో  అర్ధం కాక ఫోన్‌ పెట్టేశాడు. పదేపదే ఫోన్‌చేసి బ్యాంకు అకౌంట్‌ వెరిఫికేషన్‌ అనడంతో పేరు, ఊరు, తదితరాల వివరాలు మొత్తం చెప్పారు. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ నంబర్లు పంపించాం. త్వరగా చూసి చెప్పండని హడావుడి చేశారు. అంతంత మాత్రం చదువు కావటంతో  లక్ష్మణ ఓటీపీ నంబరే కదా అని చెప్పేశాడు. ఫోన్‌ పెట్టిన తర్వాత చూస్తే నగదు డ్రా చేసినట్లుగా మేసేజ్‌లు వచ్చాయి. ఇదేంటని గురువారం బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్‌ తీసుకుని చూస్తే అకౌంట్‌లో నుంచి నాలుగు దఫాలుగా రూ.5 వేలు చొప్పున మొత్తం రూ. 20 వేలు పేటీఎం ద్వారా డ్రా చేసినట్లుగా ఉంది.

దీంతో లక్ష్మణ లబోదిబోమంటూ వాపోయాడు. ఇదీ హనుమాన్‌ జంక్షన్‌లో చోటు చేసుకున్న సైబర్‌ నేరం. ఎంతో గోప్యంగా ఉండాల్సిన బ్యాంకు అకౌంట్‌ వివరాలు పక్కదారి పట్టడం, సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కటంతో అమాయకుల జేబుకు చిల్లు పడుతున్నాయి. స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన గేదల లక్ష్మణ ఈ సైబర్‌ నేరంపై జంక్షన్‌ పోలీసులతో పాటు ఎస్‌బీఐ అధికారులను ఆశ్రయించాడు. నాలుగైదు రోజులుగా తరచూ ఫోన్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్‌ వెరిఫికేషన్‌ అంటూ హిందీలో మాట్లాడుతూ పేరు, వివరాలు చెబుతుండటంతో బ్యాంకు అధికారులే అని నమ్మి మోసపోయానని, అసలు ఓటీపీ అనే నంబర్‌ ఉంటుందని, దాని ద్వారా కూడా మన ప్రమేయం లేకుండా డబ్బులు డ్రా చేసే యవచ్చనే అవగాహన తనకు ఇప్పటి వరకూ తెలీదని బాధితుడు వాపోయాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top