భర్త రాసినట్లుగానే లేఖలు రాసి.. | Custody Closed In Malyadri Case Hyderabad | Sakshi
Sakshi News home page

వారిని విడదీయాలనే..!

May 25 2018 10:33 AM | Updated on Sep 4 2018 5:44 PM

Custody Closed In Malyadri Case Hyderabad - Sakshi

నిందితుడు మాల్యాద్రి

బంజారాహిల్స్‌: భార్యా, భర్తల మధ్య విభేదాలు సృష్టించి ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందుకోసం తన క్రిమినల్‌ బ్రెయిన్‌తో ఓ వివాహిత జీవితంతో చెలగాటమాడిన నిందితుడు మాల్యాద్రిని మరింత సమాచారం కోసం కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, వెంకటేశ్వరనగర్‌కు చెందిన మాల్యాద్రి అపో ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. శ్రీకృష్ణానగర్‌లోని   ఓ ఇంటికి వెళ్లిన మాల్యాద్రి వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన అతను భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఆమెపై భర్తకు అనుమానం కలిగేలా ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట బోగస్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సృష్టించాడు.

ఎల్వీ ప్రసాద్‌ హెచ్‌ఆర్‌ మాట్లాడుతున్నట్లుగా తానే ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి ఆమె భర్త రాసినట్లుగా కొన్ని లేఖలు రాసి ఆమె క్యారెక్టర్‌పై అనుమానాలు రేకెత్తించాడు. అపోలో ఆస్పత్రికి కూడా లేఖలు రాసి  తనకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమె భర్త రాసినట్లుగానే లేఖలు రాసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాడు. దానిని తనకు అనుకూలంగా మార్చుకొని భర్త ఆమెను వెళ్లగొడితే తనతో పాటు ఉంచుకోవాలని పక్కా పథకం వేశాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. అపోలో, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రుల నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, భర్త రాసినట్లుగా లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నాడు. ఆమెను దక్కించుకునేందుకే సదరు వివాహిత భర్తను హత్య చేయాలని సుపారి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బోగస్‌ పత్రాలు సృష్టించినట్లు అంగీకరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement