క్షుద్రపూజల్లో భారీ పేలుడు

Blasting in Black Magic in Tamil Nadu - Sakshi

స్వామీజీ సజీవదహనం

తిరువళ్లూరు జిల్లాలో ఘటన

తమిళనాడు,తిరువళ్లూరు: వివాహితతో కలిసి అర్ధరాత్రి  ఓ స్వామీజీ చేసిన  క్షుద్రపూజల్లో భారీ పేలుడు సంభవించింది. స్వామీజీ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో కలకలం రేపింది. చెన్నై నంగనల్లూరు ప్రాంతానికి చెందిన స్వామీజీ గోవిందరాజ్‌(49). ఇతను తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో ఎకర స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఎరయమంగళం సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు సిద్ధవైద్యం జ్యోతిష్యం, సంప్రదాయ పూజలను నిర్వహిస్తూ నివాసం వుంటున్నాడు. ప్రముఖ స్వామీజీగా గుర్తింపు పొందిన గోవిందరాజ్‌ వద్దకు చెన్నై ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం వివాహిత లావణ్య... గోవిందరాజ్‌ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే పక్క గదిలో వున్న లావణ్య పేలుడు ఏర్పడిన ప్రాంతానికి వచ్చి చూడగా గోవిందరాజ్‌ సజీవంగా కాలుతుండడాన్ని గుర్తించి కేకలు వేస్తూ సమీప ప్రాంతాల వారికి విషయాన్ని చెప్పింది. లావణ్య కేకలను విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే గోవిందరాజ్‌ సజీవదహనమయ్యాడు.

లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవిందరాజ్‌ మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. గోవిందరాజ్‌ ఇంట్లో ఏర్పడిన భారీ పేలుడు విషయాన్ని మప్పేడు పోలీసులు ఫోరెన్సిక్‌ అధికారులకు చేరవేశారు. దీంతో డీఎస్పీ నళిని నేతృత్వంలో పోలీసులు గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. గోవిందరాజ్‌ నిత్యం క్షుద్రపూజలు నిర్వహించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మప్పేడు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top