అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష | Bihar Girl Molested By Group Of Men And Paraded With Head Shaved As Punishment | Sakshi
Sakshi News home page

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

Aug 27 2019 3:57 PM | Updated on Aug 27 2019 4:00 PM

Bihar Girl Molested By Group Of Men And Paraded With Head Shaved As Punishment - Sakshi

అత్యాచార బాధితురాలికి గుండు చేయించి ఊరేగించారు. ఎందుకంటే..

గయా : బీహార్‌లోని గయా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికే శిక్ష విధించారు గ్రామ పెద్దలు. నిందితులను వదిలిపెట్టి, బాధితురాలికి శిక్షగా గుండు చేయించి ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఈ నెల 14 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం కొంతమంది వ్యక్తులు కలిసి ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకువెళ్లారు. స్థానిక పంచాయతీ భవనంపైకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహా కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి బాలిక తల్లిదండ్రులు తెలపడంతో వారు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. 

మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో పేరు, బలగం ఉన్నవారు కావడంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ తిరిగి సదరు మహిళనే దోషిగా తేల్చి శిక్ష విధించింది. బాలికకు  గుండు చేయించి ఊరిలో ఊరేగించారు. దీంతో తమకు న్యాయం దక్కలేదని పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వేడుకోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సభ నిర్వహించి బాలికకు శిక్షను ఖరారు చేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

 కాగా, ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గయా సీనియర్ ఎస్పీకు లేఖ రాశారు. సెప్టెంబర్ 2వ తేదీన పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement