మహిళా దొంగల ముఠా హల్‌చల్‌ | Adilabad Based Woman Thieves Arrested At Navipeta | Sakshi
Sakshi News home page

మహిళా దొంగల ముఠా హల్‌చల్‌

Oct 1 2019 9:27 AM | Updated on Oct 1 2019 9:27 AM

Adilabad Based Woman Thieves Arrested At Navipeta - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న మహిళలు

సాక్షి, బోధన్‌: నవీపేట బస్టాండ్‌ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహిళా దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పది మంది మహిళల ముఠా వీధుల్లో పూసలు అమ్ముతున్నట్లు నమ్మించి, బస్టాండ్‌లో తోటి ప్రయాణికులతో మాట కలిపారు. బస్టాండ్‌లోకి వచ్చి పోమే ప్రయాణికులను గమనిస్తూనే చుట్టు పక్కల ప్రయాణికులతో మాటామంతి చేశారు. నవీపేటకు చెందిన ఓ మహిళ రూ.3 లక్షల చీటీ డబ్బులను బ్యాగులో వేసుకుని నిజామాబాద్‌ బస్సు ఎక్కింది. గమనించిన ముఠా సభ్యులు బస్సులో ఎక్కే ప్రయత్నం చేస్తూనే బ్యాగును పట్టుకున్నారు. గమనించిన సదురు మహిళ అప్రమత్తం కావడంతో తోటి ప్రయాణికులు ముఠాను మందలించారు. బస్సులోంచి దింపేశారు. సంతృప్తి చెందని ముఠా సభ్యులు ఎలాగైన పని కానించాలని మళ్లీ బస్టాండ్‌కు వచ్చారు. అంతలోనే హోల్‌సేల్‌ బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ నవీపేటలో రూ.48 వేల కలెక్షన్‌ చేసుకుని తిరుగు ప్రయాణానికి బస్టాండ్‌కు వెళ్లాడు. ఇతనిని గమనించిన ముఠా సభ్యులు చాకచాక్యంగా రూ.48 వేల బ్యాగును కొట్టేశారు. ఆ బ్యాగుతో ఇద్దరు మహిళలు ఆటోలో నిజామాబాద్‌ వైపు వెళ్లిపోయారు. గమనించిన బాధితుడు కేకలు వేస్తూ పరుగులు తీయగా రూ.10 వేలను కొద్ది దూరంలో పారేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న మరో ఎనిమిది మంది మహిళలను నిలదీశారు. వారిని పోలీసులకు అప్పగించారు. బాధితుడు నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement