భర్తను ప్రేమించడం లేదని మరిదిని దారుణంగా.... | 8 Year Old Drowned At Home In Kolkata By Sister In Law | Sakshi
Sakshi News home page

భర్తను ప్రేమించడం లేదని మరిదిని దారుణంగా....

Jul 3 2018 5:55 PM | Updated on Jul 30 2018 8:41 PM

8 Year Old Drowned At Home In Kolkata By Sister In Law - Sakshi

మృతుడు రిజు

కోల్‌కతా : ఎనిమిదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోల్‌కతాకు చెందిన దుఖ్రామ్‌ దాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుబ్రతా దాస్‌(22)కు ప్రియాంక(19)తో వివాహం జరిగింది. అయితే దుఖ్రామ్‌ దాస్‌ తన చిన్న కుమారుడు రిజు(8)ను చాలా గారాబంగా చూసుకునేవాడు. రిజును గారాబం చేస్తూ.. ఎప్పుడూ అతడి భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ మామగారు తన భర్తపై ప్రేమానురాగాలు చూపించకుండా..నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రియాంక భావించేది. ఈ క్రమంలో మరిదిపై ఆమె ద్వేషాన్ని పెంచుకుంది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

గత నెల 29న రిజు స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న డ్రమ్‌లో నీళ్లను తోడుకునేందుకు అందులోకి వంగి చూస్తుండగా.. అతడి వెనకాలే వెళ్లిన ప్రియాంక రిజును నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసింది. అనంతరం అతడిని డ్రమ్‌లో పడేసి మూత బిగించింది. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తే రిజు డ్రమ్‌లో పడిపోయాడని అంతా భావించారు. కానీ రిజు మరణించిన నాలుగు రోజుల తర్వాత పశ్చాత్తాప పడిన ప్రియాంక తన భర్త ముందు అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రిజు తండ్రి దుఖ్రామ్‌ దాస్‌ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం ద్వేషం కారణంగానే ప్రియాంక రిజును హత్య చేసిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement