భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

VIVO Design Center in India Soon - Sakshi

50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య

ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ

ధర రూ. 34,990 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: స్థానికంగా డివైజ్‌లను అభివృద్ధి చేసే క్రమంలో చైనీస్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్‌లో పారిశ్రామిక డిజైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను 50,000కు పెంచుకోనుంది. వివో ఇండియా డైరెక్టర్‌ (బ్రాండ్‌ స్ట్రాటజీ విభాగం) నిపుణ్‌ మార్యా ఈ విషయాలు తెలిపారు. 3.3 కోట్లు యూనిట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే దిశగా భారత్‌లో రూ. 7,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కంపెనీ ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన వివరించారు. ‘భారత్‌లో తయారు చేయడం మాత్రమే కాదు డిజైన్‌ కూడా ఇక్కడే చేస్తాం. ఇందుకోసం త్వరలో పారిశ్రామిక డిజైన్‌ కేంద్రం భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం. భారతీయ వినియోగదారుల అవసరాలపై ఈ సెంటర్‌ ప్రధానంగా దృష్టి పెడుతుంది. భారత్‌లోనే డిజైన్‌ చేసి, తయారు చేసిన తొలి ఉత్పత్తి 2020–21లోనే మార్కెట్లోకి వస్తుంది‘ అని మార్యా తెలిపారు. 

ఎక్స్‌50 సిరీస్‌ ఫోను..: ప్రీమియం సెగ్మెంట్‌కి సంబంధించి ఎక్స్‌50 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను వివో గురువారం వర్చువల్‌గా ఆవిష్కరించింది. వీటి ధర రూ. 34,990, రూ. 37,990గా ఉంటుంది. మరింత మెరుగైన ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా తదితర స్పెసిఫికేషన్స్‌ గల ఎక్స్‌50 ప్రో ధర రూ. 49,990గా ఉంటుందని మార్య చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top