తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సంవత్సర కానుకగా మహిళలకు తీపికబురు అందింది. వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ 5.91 మేరకు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నెలరోజుల వ్యవధిలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తగ్గించిన వంట గ్యాస్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
డిసెంబర్ 1న సబ్సిడీతో కూడిన వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ 6.52 మేర తగ్గించారు. జూన్ నుంచి ఆరు సార్లు వరుసగా సిలిండర్ ధర పెంపు తర్వాత తొలిసారిగా డిసెంబర్ 1న ధరలు దిగివచ్చాయి. కాగా సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ 120.50 తగ్గించినట్టు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు తగ్గడం, డాలర్తో రూపాయి విలువ బలపడటంతో వంట గ్యాస్ ధరలు దిగివచ్చాయని ఐఓసీ వెల్లడించింది.