ఇక అన్ని షాపులు 24x7  | Shops in Maharashtra can now stay open 24x7  | Sakshi
Sakshi News home page

ఇక అన్ని షాపులు 24x7 

Dec 20 2017 5:27 PM | Updated on Oct 8 2018 6:18 PM

Shops in Maharashtra can now stay open 24x7  - Sakshi

నాగ్‌పూర్ ‌: మహారాష్ట్రలో ఇక నుంచి అన్ని దుకాణాలు, మాల్స్‌ 24x7 పనిచేయనున్నాయి. రోజంతా దుకాణాలు, మాల్స్‌ తెరిచి ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం(ఎంఎస్‌ఈ)లో సవరణలు తీసుకొచ్చింది. దీంతో  బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, పెద్ద పెద్ద మాల్స్‌ రాత్రివేళ కూడా తెరిచే ఉంటాయి. మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు పనిచేస్తారని,దుకాణాలు, మాల్స్‌ మాత్రమే కాక హోటల్స్‌, హోటల్స్‌, రెస్టారెంట్లు, కూడా రోజంతా తెరచి ఉండనున్నాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ వద్ద నోటిఫికేషన్‌ను అతికించారు. అయితే, 24x7 నిబంధన నుంచి మద్యం దుకాణాలు, పబ్బులు, డిస్కోటెక్స్‌కు మినహాయింపు ఇచ్చారు. అవి మాత్రం నిర్ణీత గడువు వరకు మాత్రం తెరిచి ఉంటాయి. ఇక అన్ని షాపులు మూడు షిఫ్ట్‌లో 24x7 గంటలు తెరచే ఉండనున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంభాజీ నిలంగేకర్‌ పాటిల్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో ఎక్కువ మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. 

ఈ చట్ట సవరణ ప్రకారం ఇక నుంచి కార్మికులందరికీ వీక్లీ ఆఫ్‌ ఇవ్వడం తప్పనిసరి చేసింది. పాత ఎంఎస్‌ఈ చట్టం నిబంధనల కిందనే లైసెన్సులను పొందాల్సివసరం లేదు. నేరుగా దుకాణాలకు సంబంధించిన అథారిటీ వద్ద ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మంది వర్కర్ల కంటే తక్కువగా ఉన్న లేదా ఇంటి వద్ద ఉండే పనిచేసే ఉద్యోగులున్న చిన్న, మధ్య సైజు దుకాణాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలా చేయడం వల్ల దాదాపు 22 లక్షల చిన్న దుకాణాదారులకు లబ్ధి చేకూరనుంది. 10 మంది కంటే తక్కువ మంది వర్క్‌ఫోర్స్‌ ఉన్న దుకాణాలు 12 లక్షలకుగా పైగా ఉన్నాయి. వీరు తమ సొంత టైమింగ్స్‌ను నిర్ణయించుకోవచ్చు. ఈ సవరణ చట్టం ఐడెంటీ కార్డులను, వీక్లీ ఆఫ్‌లను, కనీస వేతనాన్ని కూడా అందిస్తోంది. దీని వల్ల దాదాపు 35లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement