
గరిష్ట స్థాయిలో అమ్మకాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేవారం జరపబోయే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచబోదన్న భరోసాతో శుక్రవారం ట్రేడింగ్
♦ సగానికి తగ్గిన సూచీల లాభాలు
♦ సెన్సెక్స్ 186 పాయింట్లు,
♦ నిఫ్టీ 37 పాయింట్లు అప్
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేవారం జరపబోయే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచబోదన్న భరోసాతో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభ సమయంలో భారీగా పెరిగిన మార్కెట్లో మధ్యాహ్న సెషన్ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో స్టాక్ సూచీల లాభాలు పరిమితమయ్యాయి. తొలి దశలో 350 పాయింట్లకుపైగా పెరిగి 28,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ సెన్సెక్స్ చేరిన సమయంలో అమ్మకాల ఒత్తిడి మొదలయ్యింది.
దాంతో సూచీ 28,495 పాయింట్ల వరకూ పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 28,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,848 పాయింట్ల గరిష్టం వరకూ పెరిగిన తర్వాత 8,750 పాయింట్ల వద్దకు క్షీణించింది. చివరకు 37 పాయింట్ల లాభంతో 8,780 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
మార్కెట్ జోరుకు అడ్డుకట్టపడటానికి బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున జరిగిన లాభాల స్వీకరణే కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిన అంశాన్ని రిజర్వుబ్యాంక్ అక్టోబర్ 4నాటి పాలసీ సమీక్షలో పరిగణనలోకి తీసుకుంటుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడంతో తొలుత బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అయితే అటుతర్వాత ఇవే షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభంకావడంతో సెంటిమెంట్ దెబ్బతిందని విశ్లేషకులు చెప్పారు.
ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ గరిష్టస్థాయి నుంచి 3 శాతంవరకూ క్షీణించి, చివరకు 0.5-1.15 శాతం మధ్య నష్టాలతో ముగిసాయి. హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, టాటా స్టీల్లు 1-2 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు మారుతి సుజుకి 2.25 శాతం పెరిగి రికార్డు గరిష్టస్థాయి రూ. 5,500పైన ముగిసింది. ఐటీసీ, ఇన్ఫోసిస్, హీరో మోటో, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు 1-2 శాతం మధ్య పెరిగాయి.