శాంసంగ్ ‘స్మార్ట్ఫోన్’ వాటా 50% | samsung smart phone shares 50percent | Sakshi
Sakshi News home page

శాంసంగ్ ‘స్మార్ట్ఫోన్’ వాటా 50%

Jul 15 2016 12:55 AM | Updated on Sep 4 2017 4:51 AM

శాంసంగ్ ‘స్మార్ట్ఫోన్’ వాటా 50%

శాంసంగ్ ‘స్మార్ట్ఫోన్’ వాటా 50%

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ హవా నడుస్తోంది. 2016 మే నాటికి దేశవ్యాప్తంగా 48.3% వాటాతో కంపెనీ అగ్రస్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా 48.3 శాతం
కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ హవా నడుస్తోంది. 2016 మే నాటికి దేశవ్యాప్తంగా 48.3% వాటాతో కంపెనీ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 50% వాటాను కైవసం చేసుకున్నట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మను శర్మ తెలిపారు. గెలాక్సీ జే2 (2016), జే మ్యాక్స్‌ను గురువారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అర్థవంతమైన ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువ అవుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఉత్పాదనను 6-8 నెలల పరిశోధన అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. కొరియా వెలుపల సంస్థకు అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం భారత్‌లో ఉందన్నారు. భారత్‌తోపాటు ప్రపంచ విపణి కోసం వివిధ మోడళ్లను ఈ కేంద్రంలోనే అభివృద్ధి చేశామన్నారు.

 తగ్గుతున్న ధరలు..
మార్కెట్ తీరుకు అనుగుణంగా వివిధ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను కంపెనీ ప్రవేశపెడుతోంది. విపణిలో రూ.10 వేలలోపు మోడళ్ల వాటాయే సింహ భాగం ఉంది. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలోనూ 4జీ మోడళ్లను శాంసంగ్ తీసుకొస్తోంది. లో ఎండ్ స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో ఉన్న జే2 మోడల్ ధర ప్రస్తుతం రూ.7,590 ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.900 తక్కువ. ఇక కంపెనీ విక్రయిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఒకటి మినహా అన్నీ 4జీ మోడళ్లే. గరిష్ట ధర రూ.56,900 ఉంది.

 టాప్‌లో ‘జే’ సిరీస్..
2జీతో పోలిస్తే 4జీ డేటా వినియోగం 5.3 రెట్లు అధికంగా ఉందని మను శర్మ అన్నారు. ‘యూట్యూబ్‌ను అధికంగా చూస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజుకు సగటున 40 నిమిషాలు వీక్షిస్తున్నారు. 50% మంది మొబైల్‌లో యూట్యూబ్‌ను చూస్తున్నారు. 2014తో పోలిస్తే 2015లో యాప్స్ డౌన్‌లోడ్స్ 129% పెరిగింది. డౌన్‌లోడ్స్ పరంగా భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డేటాను తక్కువగా వినియోగించేలా అల్ట్రా డేటా సేవింగ్ ఫీచర్‌తో ‘జే’ సిరీస్ ఫోన్లకు రూపకల్పన చేశాం. దేశంలో అధికంగా అమ్ముడవుతున్న సిరీస్‌లో జే తొలి స్థానంలో ఉంది’ అని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement