హాంకాంగ్‌ కోర్టు మెట్లెక్కిన పీఎన్‌బీ | Punjab National Bank Moves Hong kong High Court Against NiravModi | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ కోర్టు మెట్లెక్కిన పీఎన్‌బీ

Apr 21 2018 5:43 PM | Updated on Apr 21 2018 5:43 PM

Punjab National Bank Moves Hong kong High Court Against NiravModi - Sakshi

హాంకాంగ్‌లో ఉన్న నీరవ్‌ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేలకోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఈయన్ని ఇటీవలే హాంకాంగ్‌లో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను అరెస్ట్‌చేసి తమకు అప్పగించాలని భారత్‌ అధికారులు, హాంకాంగ్‌ అథారిటీలను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా హాంకాంగ్‌ హైకోర్టును ఆశ్రయించింది. హాంకాంగ్‌ హైకోర్టును మాత్రమే కాక, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి ఆస్తులు, వ్యాపారాలు ఉన్న ఇతర దేశాల కోర్టులను సైతం పీఎన్‌బీ ఆశ్రయించింది.  హైకోర్టు నోటీసులను హాంకాంగ్‌ న్యూస్‌పేపర్లు శనివారం ప్రచురించాయి.

కాగ, పీఎన్‌బీకి దాదాపు రూ.13,500 కోట్లు ఎగవేసిన నీరవ్‌ మోదీపై ఇండియాటుడే సైతం పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తోంది. నీరవ్‌ సీక్రెట్‌ అకౌంట్లు, అతనికి విదేశాల్లో ఉన్న వ్యాపారాలు, నీరవ్‌ కుంభకోణంపై అతని కుటుంబ సభ్యుల స్పందన వంటి పలు విషయాలను ఇండియాటుడే విడుదల చేసింది. మరోవైపు ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకు సైతం కొరడా ఝళిపించడం ప్రారంభించింది.  1,084 వేల మంది రుణ ఎగవేతదారులను గుర్తించిన పీఎన్‌బీ, వారిలో 260 మంది ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించింది. 

Advertisement
 
Advertisement
Advertisement