నార్వే వ్యాపార సదస్సులో 15 ఒప్పందాలు..  | Norway Can Mediate Conflict Between India, Pakistan If Asked – Prime Minister | Sakshi
Sakshi News home page

నార్వే వ్యాపార సదస్సులో 15 ఒప్పందాలు.. 

Jan 8 2019 1:23 AM | Updated on Jan 8 2019 1:23 AM

Norway Can Mediate Conflict Between India, Pakistan If Asked – Prime Minister - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నార్వే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1.2 బిలియన్‌ డాలర్ల (రూ.8,356 కోట్లు) వాణిజ్యం జరుగుతుండగా, ఇది మరింత పెరగాలని భావిస్తున్నట్లు ఆదేశ ప్రధాని ఎమ్మా సోల్బర్గ్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రారంభమైన ఇండియా–నార్వే మూడురోజుల వ్యాపార సదస్సులో పాల్గొన్న ఆమె.. ‘నూతన వ్యూహాలను అనుసరించటం ద్వారా మా దేశంతో భారత్‌ కొనసాగిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం. ప్రైవేటు రంగంతో కలిసిపనిచేయడం, పరిశోధన, సాంకేతిక సహకారం పెంపొందే దిశగా చర్చిస్తున్నాం.

ఇక్కడ మా దేశ కంపెనీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఎనర్జీ రంగంలో అవకాశాలు చాలా ఉన్నట్లు గుర్తించాం. గ్రామీణ ప్రాంత ఆధారి త వాణిజ్యాన్ని కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు హాజరైన వాణిజ్య శాఖ మంత్రి సురేష్‌ ప్రభు మాట్లాడుతూ.. ‘కీలక ఒప్పందాలపై మంగళవారం ఇరుదేశాలు సంతకాలు పూర్తిచేయనున్నాయి. తద్వారా నార్వేతో వ్యాణిజ్యం మరింత ముందుకు సాగనుందని భావిస్తున్నాం.’ అని చెప్పారు. ఈ సదస్సులో..  సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎనర్జీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఆక్వాకల్చర్‌కు చెందిన 15 కంపెనీలు ప్రధాని మోదీ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశాయి. 

శ్రేయీతో ఒప్పందం.. 
శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌.. నార్వే ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌క్రెడిట్‌ నార్గేతో (ఈసీఎన్‌) ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సులో ఇరు సంస్థల మధ్య ఎంఓయూలపై సంతకాలు పూర్తయ్యాయి. ‘ఒప్పందం ప్రకారం.. నార్వేజియన్‌ కాపిటల్‌ గూడ్స్‌ దిగుమతి, ఎక్విప్‌మెంట్‌ తయారీకి శ్రేయీ ఎక్విప్‌మెంట్‌కు ఆదేశం సహయసహకారాలతో పాటు ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ను అందించనుంది.’ అని సంస్థ చైర్మన్, ఎండీ హేమంత్‌ కనోరియా తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement