ఎన్సీడెక్స్ నుంచి గోల్డ్ నౌ
నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ (ఎన్సీడెక్స్) హైదరాబాద్లో బంగారం డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు
హైదరాబాద్లో గోల్డ్ డెలివరీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ (ఎన్సీడెక్స్) హైదరాబాద్లో బంగారం డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీడీఎక్స్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గోల్డ్ నౌ’ ఫార్వర్డ్ కాంట్రాక్టులను శుక్రవారం నుంచి హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్సీడెక్స్ బిజినెస్ హెడ్ సురేష్ దేవ్నాని తెలిపారు. గోల్డ్ నౌ ఫార్వర్డ్ కాంట్రాక్టు ద్వారా పది శాతం మార్జిన్ చెల్లించి బంగారం కోనుగోలు చేస్తే రెండో రోజుల తర్వాత డెలివరీ (టి+2) ఇస్తామన్నారు. ప్రస్తుతం కేజీ, 100 గ్రాముల పరిమాణంలో నాలుగు రకాల గోల్డ్ కాంట్రాక్టులను ఎన్సీడెక్స్ అందిస్తోంది.
ప్రస్తుతం గోల్డ్ నౌ ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్లలో అందుబాటులో ఉండగా, త్వరలోనే ముంబై, జైపూర్లలో కూడా ప్రారంభించనున్నట్లు సురేష్ తెలిపారు. వ్యవసాయ కమోడిటీ విభాగంలో మినీ కాంట్రాక్టులకు మంచి డిమాండ్ ఉందని, త్వరలోనే మరిన్ని మినీ కాంట్రాక్టులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం శనగపప్పు, ఆముదం, ఆవాల్లో మినీ కాంట్రాక్టులను అందిస్తోంది.


