బడ్జెట్‌పై అరుణ్‌ జైట్లీ కీలక హింట్‌  | Jaitley Hints Interim Budget Pitches for Lower Interest Rate | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై అరుణ్‌ జైట్లీ  కీలక హింట్‌ 

Jan 18 2019 3:01 PM | Updated on Jan 18 2019 3:01 PM

Jaitley Hints Interim Budget  Pitches for Lower Interest Rate - Sakshi

సాక్షి, ముంబై:  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  బడ్జెట్‌పై  హింట్‌ ఇచ్చారు. సీఎన్‌బీసీ ఇండియన్‌ బిజినెస్‌ లీడర్‌ అవార్డుల కార్యక్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  మాట్లాడారు.  ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాత సాంప్రదాయాన్ని బ్రేక్‌ చేయవచ్చంటూ హింట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే  తాత్కాలిక బడ్జెట్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ కాకపోవ‍్చని పేర్కొన్నారు.  కేవలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా మాత్రమే కాక అంతకుమించి ఉండొచ్చని అన్నారు.

దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందని జైట్లీ  అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని ఆ‍ర్థిక మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.  అంతేకాదు ఈ బడ్జెట్‌లో  రైతులకు భారీ ఉపశమనాన్ని ఇవ్వనుందని పేర్కొన్నారు. వ్యవసాయం రంగం అనేక సవాళ్లు ను ఎదుర్కొంటోందని  ఒప్పుకున్న  ఆయన, రైతు సహాయక చర్యలను ప్రజాకర్షక చర్యగా పరిగణించరాదని అన్నారు.  నరేంద్ర మోదీ సర్కారు చిన్న,మధ్య తరహా రైతులకు  రూ.3లక్షలు దాకా వడ్డీ లేని రుణాలను ఇవ్వనుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

మరోవైపు వడ్డీరేటు పెంపుపై  ఎలాంటి నిర్దిష్ట వ్యాఖ్యలు  చేయనప్పటికి ..2019 మార్చిలో ​ఆర్‌బీఐ 50 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న మాజీ బ్యాంకు అధికారి ఉదయ కోటక్‌  వ్యాఖ్యలకు ప్రతిగా దేశీయ వాస్తవ వడ్డీరేట్లు ప్రపంచంలోనే  అధిక స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదని  చెప్పుకొచ్చారు.

కాగా సాధారణంగా ఎన్నికల ఏడాదిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement