బిట్‌కాయిన్‌పై ఐటీ ఫస్ట్‌ బిగ్‌ యాక్షన్‌

Income-Tax dept conducts surveys at Bitcoin exchanges across country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సంచలన వర్చ్యువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌  వ్యవహారంలో దేశంలో  తొలిసారి  ఐటీ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బిట్‌కాయన్‌ ఎక్సేంజ్‌లపై ఆదాయ పన్ను శాఖ  సర్వే నిర్వహించింది.   పన్ను ఎగవేత అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.  దాదాపు తొమ్మిది ప్రధాన  ఎక్సేంజీల  కార్యాలయాలను అధికారులు సందర్శించారు.

బెంగళూరుకు చెందిన ఐటీ విభాగం అదికార బృందాలు  ఢిల్లీ, బెంగళూరు,  ఘజియాబాద్‌, పునే, హైదరాబాద్, కొచ్చి, గురుగ్రావ్‌లోని ఎక్సేంజ్‌లలో బుధవారం తొలి ఉదయం నుంచి  ఈ సర్వే  చేపట్టారు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 133 ఎ ప్రకారం, పెట్టుబడిదారుల, వ్యాపారుల గుర్తింపు, తీసుకున్న లావాదేవీలు, కౌంటర్‌పార్టీల గుర్తింపు, సంబంధిత బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం లాంటి ఇతర సమాచారాన్ని  సేకరించాయి.

కాగా  స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లలో "డిజిటల్ వాలెట్" రూపంలోదాచుకునే క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌. భారీ ర్యాలీతో ఈ బిట్‌కాయిన్‌ ఇటీవలి  బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.  2009లో తొలిసారి దీన్ని సృష్టించగా  తాజాగా ఇది 20వేల డాలర్ల మార్క్‌ దిశగా పరుగులుపెడుతోంది. దీంతొ  బిట్‌కాయిన్‌ బబుల్‌పై వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతో  పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ట్రేడర్లను, వర్చువల్ కరెన్సీల వ్యాపారులను హెచ్చరించింది. మరోవైపు  ఇండియాలో,  ప్రపంచవ్యాప్తంగా వర్చువల్‌ కరెన్సీ  ప్రభావం పై అంచనా, సూచనల కోసం మార్చిలో ఇంటర్ డిసిప్లినరీ కమిటీని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top