బ్రీఫ్స్
సీఎంఐకి ఇండియన్ రైల్వేస్ భారీ కాంట్రాక్ట్
కేబుల్ తయారీ సంస్థ సీఎంఐ లిమిటెడ్ ఇండియన్ రైల్వేస్ నుంచి రూ.107 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను దక్కించుకుంది. కాడ్మియం క్యాటనరీ వైర్ సరఫరాకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్ను అత్యంత తక్కువ బిడ్డింగ్ ద్వారా దక్కించుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రివర్స్ ఆక్షన్ విధానంలో ఈ టెండర్ నిర్ణయమైనట్లు బీఎస్ఈకి తెలియజేసింది. కంపెనీ షేర్ మంగళవారం నిఫ్టీలో 1.75 శాతం (రూ.3.10) పెరిగి 180.35 వద్ద ముగిసింది.
రాఘవ్ కమోడిటీస్పై రూ.25 లక్షల జరిమానా
రాఘవ్ కమోడిటీస్పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.25 లక్షల జరిమానా విధించింది. మోసపూరిత ట్రేడ్కు సంబంధించి ఆరోపణలపై ఈ జరిమానా విధించినట్లు ఒక నోట్లో పేర్కొంది. బీఎస్ఈలో ఇల్విక్విడ్ స్టాక్ ఆప్షన్స్ సెగ్మెంట్లో కృత్రిమ వ్యాల్యూమ్స్ సృష్టించినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.
శిల్పా మెడికేర్ క్యాన్సర్ చికిత్స ఇన్జెక్షన్కు ఎఫ్డీఏ ఆమోదం
కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు వినియోగించే ఐరినోటికాన్ హెచ్సీఎల్ ఇంజెక్షన్కు అమెరికా హెల్త్ రెగ్యులేటర్– అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ఆమోదం లభించింది. 40 ఎంజీ (2ఎంఎల్), 100 ఎంజీ (5 ఎంఎల్), 20ఎంజీ (ఎంల్) సింగిల్ డోస్ ఇన్జెన్షన్కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు శిల్పా మెడికేర్ సంస్థ బీఎస్ఈకి తెలియ జేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ నిఫ్టీలో 2 శాతం పెరిగి రూ.392.60 వద్ద ముగిసింది.
సెంట్రల్ కోల్ ఫీల్డ్ చరిత్రాత్మక ఉత్పత్తి
ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం– కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్... డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించింది. ఈ నెల్లో ఉత్పత్తిలో 17.7 శాతం వృద్ధి నమోదయ్యింది. 5.7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ నమోదుచేసినట్లు సీఎండీ గోపాల్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018–19 మూడు త్రైమాసికాల్లో సంస్థ 41.65 మిలి యన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, ఇది 12 శాతం (37.2 శాతం) అధికం. కాగా కోల్ ఇండియా ఉత్పత్తి ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 7.4 శాతం వృద్ధితో 412.45 మిలియన్ టన్నులకు చేరింది.
షావోమీ టీవీ మోడళ్లపై తగ్గిన ధరలు
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం– షావోమీకి చెందిన కొన్ని టీవీ మోడళ్లపై ధరలు రూ.2,000 వరకు తగ్గాయి. ఇది ఇటీవలి జీఎస్టీ రేటు తగ్గింపు ప్రభావమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏపై ధర రూ.1,500 తగ్గింది. ఇక 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీప్రోపై ధర రూ.2,000 వరకూ తగ్గింది. తక్షణం తగ్గిన చార్జీలు అమల్లోకి వస్తాయి. టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు