ఐఓసీ ఎల్‌పీజీ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు చేరిక

BPCL And HPCL Join in IOC LPG Project - Sakshi

దేశంలోనే అతి పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌

ప్రాజెక్ట్‌ వ్యయం రూ.9,000 కోట్లు నాలుగేళ్లలో పూర్తి

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ(ఐఓసీ) చేపట్టిన భారీ  ఎల్‌పీజీ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు కూడా చేతులు కలుపుతున్నాయి. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వరకూ 2,757 కిమీ  ఈ  పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ను రూ.9,000 కోట్ల పెట్టుబడులతో ఐఓసీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో చెరో 25 శాతం వాటా తీసుకోనున్నట్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఈ మూడు కంపెనీల జాయింట్‌వెంచర్‌ కానున్నది.

3  రాష్ట్రాలు...22 ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లు
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కాండ్లా వద్ద ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటారు. పశ్చిమ తీర ప్రాంతంలో కొన్ని రిఫైనరీల నుంచి కూడా ఎల్‌పీజీని తీసుకుంటారు.  ఆ తర్వాత దీనిని అహ్మదాబాద్, ఉజ్జయిని, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నోలకు పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఈ మూడు కంపెనీలకు చెందిన 22 ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లకు ఈ పైప్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ కారణంగా రోడ్డు రవాణా వ్యయాలు కలసిరావడమే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగైనదని నిపుణులంటున్నారు.  ఈ పైప్‌లైన్‌ ఏడాదికి 6 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీని సరఫరా చేస్తుంది. దేశంలో ఇదే అతి పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని అంచనా. ప్రస్తుతం గెయిల్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ నుంచి న్యూఢిల్లీ సమీపంలోని లోని వరకూ 1,415 కిమీ. ఎల్‌పీజీ పైప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. ఈ పైప్‌లైన్‌ ద్వారా ఏడాదికి 2.5 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీని     సరఫరా చేస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top