జగన్‌ హమారా | YS Jagan Navaratnalu Scheme Hopeful For Muslim People In Prakasam | Sakshi
Sakshi News home page

జగన్‌ హమారా

Mar 30 2019 10:51 AM | Updated on Mar 30 2019 10:52 AM

YS Jagan Navaratnalu Scheme Hopeful For Muslim People In Prakasam - Sakshi

సాక్షి, దర్శి: ఆధ్మాత్మిక చింతనలో మనుగడ సాగిస్తున్న ఇమామ్, మౌజన్లకు స్థిరమైన ఆదాయం లేకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్థానికులు అందజేస్తున్న విరాళాలతోనే కుటుంబాలు వెళ్లదీస్తున్న వారికి ప్రభుత్వ పరంగా అతి తక్కువ సాయం మాత్రమే అందుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముస్లింల కష్టాలను కళ్లారా చూసిన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. తాను అధికారంలోకి రాగానే ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు ప్రతి నెల గౌరవ వేతనంగా అందిస్తానంటూ ప్రకటించారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ఇమామ్, మౌజన్ల కుటుంబాల్లో వెలుగు నిండనున్నాయి. విరాళాలతో కాలం గడుపుతున్న తమకు ఇకపై జగన్‌ వల్ల సమాజంలో సముచిత గౌరవం దక్కనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి
జిల్లాలో సుమారుగా 520 మసీదులు ఉన్నాయి. ఒక్కో మసీదుకు ఒక ఇమామ్, ఒక మౌజన్‌ లెక్కన 1040మంది ఇమామ్‌లు, మౌజన్‌లు పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 36 మసీదులు ఉండగా 72 మంది ఇమామ్‌లు, మౌజన్‌లు పని చేస్తున్నారు.    జిల్లాలోని ముస్లిం ఆధ్యాత్మిక సంస్థల్లో పని చేస్తున్న మత పెద్దలు చాలీ చాలనీ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా చోట్ల మసీదులను చందాలతో నిర్మిస్తారు. వాటికి ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. అక్కడికి వచ్చే ముస్లింలతో నమాజ్‌ చదివించే ఇమామ్‌లకు రూ.5వేలు, వాటి నిర్వహణ చూసుకునే మౌజన్లకు రూ.3వేలు ఇస్తుంటారు. ఈ మొత్తం ఎందుకూ చాలడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు.

బాబు హామీ..నిబంధనల కొర్రీ 
ఇమామ్, మౌజాన్‌లకు గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఎన్నో నిబంధనలు పెట్టారు. గౌరవ వేతనం అందుకోబోయే వారు పని చేస్తున్న మసీదులకు భూములు, చరాస్తులు, ఆదాయ మార్గాలు ఏవీ ఉండరాదని, వక్ఫ్‌ బోర్డులో ఆ మసీదు రిజిస్టర్‌ అయి ఉండాలని తదితర నిబంధనలు పెట్టారు. మసీదుతో పాటు స్థిర, చరాస్తి డాక్యుమెంట్లు, వాటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంది. ఇన్నీ చేసిన తర్వాత ముతవల్లి కమిటీ ద్వారా సిఫారసు పత్రం జత చేయాలి. ఇలాంటి అర్ధ రహిత కారణాలతో గౌరవ వేతనాలు సక్రమంగా అందకుండా పోతున్నాయి.  జగన్‌ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు న్యాయం చేకూరుతుంది. 
– డాక్టర్‌ ఎస్‌ఎం బాషా, ప్రముఖ హోమియో వైద్యులు 

జగన్‌తోనే ముస్లింల సంక్షేమం
ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత మహానేత వైఎస్సార్‌ ఎంతో శ్రమించారు. ఆయనలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ముస్లిం సంక్షేమం కోసం పలు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆ హామీలన్ని ఆయన నెరవేర్చి తీరుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ముస్లింల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్‌ అధికారంలోకి వస్తే జిల్లాలోని అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందుతుంది. 
– బాబావలి, దర్శి 

ఎందరికో మేలు జరుగుతుంది 
ముస్లింలలో ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు తాను అధికారంలోకి రాగానే గౌరవ వేతనం ఇస్తానంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం.  అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తామంటూ జగన్‌ ముందుకు రావడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. జగన్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. 
– షేక్‌ హుస్సేన్, మదీనా మసీద్‌ ప్రెసిడెంట్‌ 



వైఎస్సార్‌లా ఆదుకుంటారు 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారు. ఆయన తనయుడిగా వైఎస్‌ జగన్‌ కూడా మా సంక్షేమానికి పాటు పడతారని ఆశిస్తున్నాం. ప్రార్థనా మందిరాల్లో ఇమామ్‌లు, మౌజన్‌ల సేవలను గుర్తించి వారి కష్టాలను గుర్తించి జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలు స్వాగతించాలి.
– నాగూర్, దర్శి 

అభినందనీయం 
ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలనుకోవడం అభినందనీయం. జిల్లాలోని చాలా మసీదుల్లో ఇమామ్, మౌజన్‌లుగా ఉన్న వారు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. గౌరవ వేతనం నేరుగా ఇమామ్‌ల అకౌంట్‌కు వేస్తే ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఈ విషయంలో జగన్‌కు ఎంతో రుణపడి ఉంటాం. 
– పఠాన్‌ దస్తగిరి, మౌజన్, రాజంపల్లి మసీద్‌


రూ.3వేలతో ఎలా బతకాలి 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే  ఇమాంమ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తామని చెబుతున్నారు. ఆయన ఇస్తారనే నమ్మకం మాకుంది. అందుకే జగన్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. 
– షేక్‌ అబ్దుల్‌ బషీర్, మర్కస్‌ మసీద్, దర్శి

రుణపడి ఉంటాం 
ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచాలని ఆలోచించిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయన ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు గట్టెక్కుతాయి. జగన్‌కు రుణపడి ఉంటాం. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడిచేది చాలా కష్టంగా ఉంది. ఈ తరుణంలో జగన్‌ ప్రకటన ఎంతో సంతోషం కలిగించింది. 
– షేక్‌ ఇమ్రాన్, ఇమామ్, రాజంపల్లి మసీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement