ఒక్కసారి ఆలోచించండి!

Voters Should Think And Vote For Andhra Pradesh Elections - Sakshi

గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన  ఎమ్మెల్యే పాశం  

అభివృద్ధి పేరుతో నోట్ల కోసం పార్టీ ఫిరాయింపు

అభివృద్ధిని విస్మరించి అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన వైనం  

సాక్షి, గూడూరు: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొందిన పాశం సునీల్‌కుమార్‌ అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించాడు. ఆ తరువాత అభివృద్ధిని విస్మరించి భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. సిలికా అక్రమ తరలింపు, భూఆక్రమణల ద్వారా కోట్లకు పడగలెత్తాడు. తనను గెలిపించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను తన స్వార్థం కోసం వంచించడం చర్చనీయాంశంగా మారింది. పాశం టీడీపీలో ఎన్నో ఏళ్లు పనిచేసినా గుర్తింపు లభించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

విలువలు, విశ్వసనీయతకు కట్టుబడిన, మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం వైఎస్సార్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి   గూడూరు టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు టికెట్‌ ఇవ్వగా ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులను మోసం చేస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకుని వెన్నుపోటు పొడిచారు. అప్పట్లో గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించినట్లు సమర్ధించుకున్నారు. ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు.

తన అభివృద్ధే ధ్యేయంగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. సిలికా అక్రమ రవాణా, లిక్కర్‌ సిండికేట్, భూఆక్రమణల ద్వారా కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పనుల్లోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. గూడూరులోని ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు. రెండు పట్టణాలను కలిపే ఫ్లయిఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించలేకపోయారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారు. తెలుగుగంగ కాలువల ద్వారా సాగునీటిని అందించలేకపోవడంతో రైతులు పొలాలను బీళ్లుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దుగరాజపట్నం పోర్టు సాధన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జన్మభూమి కమిటీలతో ఎమ్మెల్యే పాశం  అరాచక పాలన సాగించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుల మేరకే సంక్షేమ పథకాలు మంజూరు చేశారు. దీంతో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని.  హోదా వస్తే రాష్ట్రానికి రాయితీలు వస్తాయి. తద్వారా పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. అలాంటి ప్రత్యేక హోదాను ప్యాకేజీయే మేలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఆ తరువాత హోదా కోసం యువత ఉద్యమించడంతో యూటర్న్‌ తీసుకుంది. వైఎస్సార్‌సీపీ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రస్తుత అసెంబ్లీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు తన ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించి రాజీనామా చేశారు.

దుగ్గరాజపట్నం పోర్టుతో గూడూరు ప్రాంత అభివృద్ధి సాధ్యమని నమ్మి దీక్షలు సైతం చేపట్టారు. పోర్టు కోసం కేంద్రంలోని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ‘పోర్టుకు నిధులు కేటాయింపు విభజన చట్టంలో పొందుపరిచి ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు కోసం దుగరాజపట్నం అభివృద్ధిని సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. సీఎం ఒక్క సంతకం చేస్తే పోర్టు పనులు ప్రారంభమవుతాయని’ వాకాడులో పోర్టు కోసం చేపట్టిన దీక్షలోనూ, పలు పత్రికా సమావేశాల్లోనూ వరప్రసాద్‌రావు వెల్లడించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top