‘స్వైన్‌ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’ | Vijaya Sai Reddy Questions Centre Over Swine Flu Death toll In Ap | Sakshi
Sakshi News home page

‘స్వైన్‌ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’

Feb 12 2019 6:09 PM | Updated on Feb 12 2019 8:23 PM

Vijaya Sai Reddy Questions Centre Over Swine Flu Death toll In Ap - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ బారినపడి 2018 నుంచి ఇప్పటివరకు 21 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ వ్యాధిపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2018లో ఏపీలో 402 మంది స్వైన్‌ ఫ్లూ బారినపడగా 17 మంది మరణించారని పేర్కొన్నారు. 2019లో ఏపీలో ఇప్పటివరకు 77 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 169 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదు కాగా, అందులో ఆరుగురిని ఈ వ్యాధి కబళించిందని పేర్కొన్నారు.

మెడికల్‌ కాలేజీ ఆడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం..
మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఆడ్మిషన్లలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో జీవో నంబర్‌ 550ని ఉల్లంఘిస్తూ జరిపిన మెడికల్‌ సీట్ల భర్తీ కారణంగా రిజర్వేషన్‌ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీ దృష్టికి వచ్చిందా అని మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ దుబే మెడికల్‌ కాలేజీ అడ్మిషన్ల కోసం ప్రతి రాష్ట్రం సొంతంగా రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆలిండియా కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement