
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు.. మెడికల్ విద్యార్థులను దారుణంగా కొట్టిన పోలీసులు.. ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ మహిళా విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
విదేశీ వైద్య విద్యార్థులను ఏఆర్ గ్రౌండ్స్కి పోలీసులు తరలించారు. గాయాలపాలైన విద్యార్ధులకు వైద్య సదుపాయం కూడా అందించలేదు. విద్యార్థులను కలిసేందుకు ఏఆర్ గ్రౌండ్స్కు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ రాగా.. విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఏఆర్ గ్రౌండ్స్లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేశారు.
విదేశీ వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు ఏఆర్ గ్రౌండ్స్కి వచ్చిన సీపీఎం నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులపై సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించలేకపోతున్నారని.. అందుకే ఏటా వందల మంది విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన చేస్తున్నా హెల్త్ మినిస్టర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సాక్షిగా విద్యార్థులపై దాడి జరగడం హేయమైన చర్య, దేశమంతా ఒక రూలు.. ఏపీలో మరొక రూలా? ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అంటూ బాబురావు ప్రశ్నించారు.