రెండు లారీల బియ్యం పట్టివేత | two rice transport lorries seized | Sakshi
Sakshi News home page

రెండు లారీల బియ్యం పట్టివేత

Dec 12 2013 5:17 AM | Updated on Sep 2 2017 1:29 AM

రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రేణింగవరం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.

పంగులూరు, న్యూస్‌లైన్ : రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రేణింగవరం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎస్సై ఎన్.రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం... పంగులూరు మండలం చందవరం గ్రామం వద్ద సిబ్బందితో కలిసి ఎస్సై రాఘవరావు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటుగా వెళ్తున్న రెండు లారీలను తనిఖీ చేశారు. ఆ రెండు లారీల్లో బియ్యం ఉండటంతో అనుమానం వచ్చి అనుమతి పత్రాలు అడిగారు. వారివద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు అవి రేషన్ బియ్యంగా తేలడంతో లారీలతో సహా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అద్దంకిలోని సివిల్ సప్లయిస్ గోడౌన్‌కు బియ్యాన్ని తరలించారు. రెండు లారీల్లో 360 బస్తాల (18 టన్నులు) రేషన్‌బియ్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడు నుంచి ఆ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు తహసీల్దార్ ప్రశాంతి,ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ లింగారావు విచారణ చేపట్టారు.
 
 రేపల్లె సమీపంలో లారీ బియ్యం...
 రేపల్లె (గుంటూరు), న్యూస్‌లైన్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం ఉదయం గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దార్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డికి అందిన సమాచారంతో పెనుమూడి చెక్‌పోస్టువద్ద రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. చీరాల పట్టణ పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్‌మిల్లు నుంచి రాజమండ్రికి ఆ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ మేరకు పెనుమూడి-పులిగడ్డ వారధి చెక్‌పోస్టు వద్ద నిఘా ఏర్పాటు చేసి 200 బస్తాల్లో (50 కేజీల బస్తాలు) ఉన్న 100 క్వింటాళ్ల బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
 లారీలో ఉన్న మరో వ్యక్తి నండూరి శ్రీనివాసరావు పరారయ్యాడు. రేషన్ బియ్యం తరలిస్తున్న పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్‌మిల్లుపై ఒంగోలు విజిలెన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్‌చేసి 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ దాడుల్లో రేపల్లె పట్టణ సీఐ యూ నాగరాజు, ఎస్సై అవ్వారు వెంకటబ్రహ్మం, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై ఖాశీంసైదా, కానిస్టేబుల్ సత్యసాయి, వీఆర్వోలు సర్దార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement